అదృష్టమంటే ఈ అమ్మాయిదే..

పట్టిందల్లా బంగారం అని ఒక సామెత. ఇప్పుడు కృతి శెట్టిని చూసి ఈ మాటే అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. ఈ అమ్మాయి కెరీర్ ఆరంభంలోనే ఒక అద్భుతం జరిగింది. అసలు తనకు సంబంధం లేని సినిమాతో ఆమె కథానాయికగా పరిచయం అయింది. వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ‘ఉప్పెన’ సినిమాలో ముందు అనుకున్న కథానాయిక వేరు.

ఓ మలయాళ అమ్మాయిని కథానాయికగా అనౌన్స్ చేస్తూ సినిమాను మొదలుపెట్టారు. కానీ ఏం జరిగిందో ఏమో.. ఆ సినిమా నుంచి ఆమెను తప్పించారు. ఆమె స్థానంలోకి కృతి శెట్టి వచ్చింది. ఇక ‘ఉప్పెన’ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో.. కృతికి ఎంత పేరొచ్చిందో తెలిసిందే. ఆ సినిమా సక్సెస్‌లో ఆమె పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు.

ఐతే తొలి సినిమాకు సెట్టయినంత బాగా.. తర్వాతి చిత్రాల్లో కృతి సెట్  కాలేదన్నది వాస్తవం. ‘శ్యామ్ సింగ రాయ్’లో కృతి పాత్ర అంతగా ఆకట్టుకోలేదు. ఆమె ఇంపాక్ట్ ఏమంత కనిపించలేదు. కానీ మరీ గొప్ప టాక్ ఏమీ రాకున్నా బాక్సాఫీస్ దగ్గర పరిస్తితులు కలిసొచ్చి ‘శ్యామ్ సింగ రాయ్’ మంచి విజయమే సాధించింది. కృతి ఖాతాలో రెండో హిట్ జమ అయింది. ఇంకొన్ని రోజుల్లోనే కృతి సినిమా ఇంకోటి రిలీజైంది. అది కూడా హిట్ అయ్యే దిశగా పరుగులు పెడుతోంది.

ఆ చిత్రమే.. బంగార్రాజు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం వీకెండ్లో మంచి వసూళ్లు రాబట్టింది. దీనిపై పెట్టిన పెట్టుబడిని, వస్తున్న వసూళ్లను బట్టి చూస్తే ఇది కూడా సూపర్ హిట్టయ్యేలా కనిపిస్తోంది. నిజానికి ఇందులోనూ కృతి పాత్ర పేలలేదు. నాగలక్ష్మి పాత్ర సాధారణంగా అనిపించింది. తన నటన అంతగా ఆకట్టుకోలేదు. కానీ కృతికి అదృష్టం కలిసొచ్చి ఈ చిత్రం కూడా సూపర్ హిట్టయి కృతి హ్యాట్రిక్ కంప్లీట్ చేయడం లాంఛనమే అనిపిస్తోంది.