గోవా బీజేపీకి కొత్త మొగుడు.. కాంగ్రెస్‌ను మించి దూకుడు!

కేవలం 36 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతి చిన్న రాష్ట్రం గోవాలో.. సునాయాస విజ‌యాన్ని ద‌క్కించుకోవాల‌ని క‌ల‌లు కంటున్న బీజేపీ కి.. ఇప్పుడు టెన్ష‌న్ ప‌ట్టుకుంది. గెలుస్తామా.. లేదా.. అనే ధీమా కూడా క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ కాదు! తొలిసారి ఎన్నిక‌ల‌లో పోటీ ఇస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌). గోవా ఎన్నికల సందర్భంగా ఆమ్‌ఆద్మీ పార్టీ అక్కడి ఓటర్లపై హామీల వర్షం కురిపించింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే చేసే పనులను వివరిస్తూ 13 పాయింట్ల అజెండాను ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

విద్యా, వైద్యం, వ్యాపారం, జీవనోపాధి, మైనింగ్, మౌలిక వసతులు సహా పలు రంగాల్లో సంస్కరణలు చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి, మహిళలకు ప్రతి నెలా రూ.వెయ్యి సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల వల్ల ప్రతి కుటుంబం రూ.10 లక్షల మేర ప్రయోజనం పొందుతుందని చెప్పారు. గోవాలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న కేజ్రీవాల్.. అధికారంలోకి వస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. ఈ ప‌రిణామం.. క‌లివిడి లేని క‌మ‌ల నాథుల పార్టీలో గుబులు పుట్టిస్తోంది.

నిరుద్యోగులకు రూ.3 వేల చొప్పున భృతి అందించనున్నట్లు కేజ్రీవాల్‌ తెలిపారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు ప్రతి నెలా రూ.వెయ్యి సాయం చేస్తామని వెల్లడించారు. ప్రతి గ్రామంలో మొహల్లా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక రంగం అభివృద్ధి చేస్తామని వివరించారు. గోవాలో 24 గంటల విద్యుత్‌, నీటి సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు.

“గోవా ప్రజలు ఫిబ్రవరి 14న జరగనున్న ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వారికి ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఇంతకుముందు బీజేపీ, కాంగ్రెస్ తప్ప మూడో ప్రత్యామ్నాయం కనిపించేది కాదు. కానీ ఇప్పుడు ఆప్ ఉంది. రెండు పార్టీలతో విసిగిపోయిన ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు. ఆప్ అధికారంలోకి వస్తే అవినీతి లేని పాలన అందిస్తాం.” అని కేజ్రీవాల్ చేస్తున్న ప్ర‌చారం స‌హ‌జంగానే ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తోంది. ఇది.. బీజేపీ స‌హా కాంగ్రెస్‌లోనూ గుబులు రేపుతుండ‌డం గ‌మ‌నార్హం.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని కేజ్రీవాల్ తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందితే.. ప్రతి కుటుంబానికి రూ.50 వేల వరకు డబ్బు ఆదా అవుతుం దని చెప్పారు. ప్రభుత్వ విద్య ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబం రూ.22 వేలు ఆదా చేసుకుంటుందని తెలిపారు. ఇలా.. ఆప్ అధికారంలోకి వస్తే గోవాలోని ప్రతి కుటుంబం ప్రభుత్వ పథకాల ద్వారా రూ.10 లక్షల మేర ప్రయోజనం పొందుతుందని అన్నారు. దీంతో ఇప్పుడు ఎన్నిక‌ల వ్యూహాలు మారే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రి బీజేపీ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.