టికెట్ల గొడవపై మంచు విష్ణు మాట

Manchu Vishnu
Manchu Vishnu

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల గురించి కొన్ని నెలలుగా ఎంత చర్చ నడుస్తోందో తెలిసిందే. దీని గురించి ఇండస్ట్రీ తరఫున చాలామంది మాట్లాడారు. ఏపీ ప్రభుత్వంతో పరిశ్రమ తరఫున పెద్దలు వెళ్లి చర్చలు జరిపారు. కానీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు మాత్రం దీని గురించి ఏమీ మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

దీని గురించి రోజూ సోషల్ మీడియాలో మంచు విష్ణు మీద కౌంటర్లు పడుతూనే ఉంటాయి. జగన్‌కు బంధువు కూడా అయిన విష్ణు.. ఈ సమస్య మీద ఎందుకు మాట్లాడడు, చర్చలు జరపడు అని ప్రశ్నిస్తూనే ఉన్నారు నెటిజన్లు. ఐతే ఓ ఇంటర్వ్యూలో ఈ అంశం మీద విష్ణు మాట్లాడాడు. ‘మా’ అధ్యక్షుడిగా వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో విష్ణు ఈ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో టికెట్ల అంశంపై అతనేమన్నాడంటే..‘‘టికెట్ల ధరల అంశంపై ఇప్పటికే ఫిలిం ఛాంబర్ తరఫున కొందరు పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు.

ఇలాంటి టైంలో ‘మా’ అధ్యక్షుడి హోదాలో నేనేమైనా వారి ఆలోచనలకు విరుద్ధంగా మాట్లాడితే మొత్తం ఇష్యూని పక్కదారి పట్టించినట్లు అవుతుంది. అందుకే నేనే కాదు.. వ్యక్తిగత స్థాయిలో ఎవరూ ఈ అంశం గురించి మాట్లాడకూడదన్నది నా ఉద్దేశం. సినిమా వాళ్ల మీద మీడియా, సోషల్ మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. మనం ఏం మాట్లాడినా.. దానికి వక్ర భాష్యాలు చెప్పి వివాదాస్పదం చేస్తారు.

కాబట్టి బాధ్యతతో వ్యవహరించాలి. ఒక క్రికెట్ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ ప్రతి అంశం గురించి మాట్లాడరు. కేవలం కెప్టెన్ లేదా కోచ్ లేదా జట్టును నడిపించే సంస్థ ప్రతినిధులు ఆటగాళ్ల తరఫున అన్ని విషయాల మీదా మాట్లాడతారు. అలాగే ప్రస్తుతం సినీ పరిశ్రమకు చెందిన సమస్య మీద పెద్ద వాళ్లు మాట్లాడుతున్నపుడు మిగతా వాళ్లు మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అని విష్ణు స్పష్టం చేశాడు.