బిల్ గేట్స్ మీద లైంగిక ఆరోపణలు

ఇవాల్టి రోజున ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని ప్రత్యక్షం కానీ.. పరోక్షంగా కానీ ప్రభావితం చేసే కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ ఒకటి. ఆధునిక మనిషి జీవితాన్ని.. వారి జీవన గమనాన్ని మరింత సరళంగా.. సౌకర్యవంతంగా మార్చటంలో మైక్రోసాఫ్ట్ చేసిన ప్రయత్నాన్ని ఎవరూ మర్చిపోలేదు. అలాంటి ఈ సంస్థ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన బిల్ గేట్స్ లాంటి వ్యక్తుల మీద లైంగిక ఆరోపణలు రావటం ప్రపంచాన్ని షాక్ కు గురి చేశాయి.

గతంలోకి వెళితే.. 2007లో గేట్స్ మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ గా ఉన్న వేళలో ఒక మహిళా ఉద్యోగికి ఆయన అభ్యంతరకర ఈ మొయిల్ పంపటమే కాదు.. ఆమెను బయట పర్సనల్ గా కలవాలని ఆహ్వానించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఉదంతం జరిగిన ఏడాది తర్వాత కంపెనీ బోర్డు ద్రష్టికి ఈ విషయం వెళ్లింది. ఇది సరైన తీరుకాదని.. సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుల టీం గేట్స్ కు వార్నింగ్ ఇచ్చింది. అయితే.. ఈ మొయిళ్లను తాను పంపిన విషయాన్ని గేట్స్ అంగీకరించటం గమనార్హం.

ఆ ఆరోపణల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి తప్పుకున్నట్లుగా బిల్ గేట్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కంపెనీ అంతర్గతంగా కొత్త చర్చను తెర మీదకు తీసుకొచ్చింది. లింగ వివక్ష లాంటి అంశాల్లో కంపెనీ విధానాల్ని సమీక్షించాలని కంపెనీ షేర్ హోల్డర్లు చేసిన సూచనను మైక్రోసాఫ్ట్ అంగీకరించింది. ఈ డిమాండ్ ను ప్రధానంగా వినిపించిన షేర్ హోల్డర్లలో అర్జున క్యాపిటల్ ఒకటిగా చెబుతారు.
ఇందులో భాగంగా ‘‘అరెంట్ ఫాక్స్ ఎల్ఎల్ పీ’’ అనే న్యాయ విచారణ సంస్థను నియమించుకొని.. గేట్స్ మీద వచ్చిన ఆరోపణలను సమీక్షించనుంది. అంతేకాదు.. 2019 తర్వాత బోర్డు సభ్యులతో సమా ఇతర ఉన్నతస్థాయి వ్యక్తులపై వచ్చిన అన్ని రకాల వేధింపుల ఆరోపణలపైనా విచారణ చేయాలని నిర్ణయించింది.

ఈ విచారణ అనంతరం బోర్డుకు.. కంపెనీ యాజమాన్యానికి కొన్ని సిపార్సుల్ని చేయనుంది. వాటిని ఎలా అమలు చేయాలన్న విషయాన్ని వివరించనుంది. దీనికి సంబంధించిన నివేదిక ఈ వేసవికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. తమ విచారణలో భాగంగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆందోళనలు.. వాటి పరిష్కారానికి కంపెనీ తీసుకున్న చర్యలపైనా ఈ విచారణ సంస్థ ప్రధానంగా ఫోకస్ చేయనుంది.ఇతర కంపెనీల్లో అనుసరించే ఉత్తమ విధానాలతో మైక్రోసాఫ్ట్ నిబంధనల్ని పోల్చి రేటింగ్ కూడా ఇవ్వనుంది.
ఈ అంశంపై మెక్రోసాఫ్ట్ కు సీఈవోగా వ్యవహరిస్తున్న సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. కంపెనీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు తమకున్న అవకాశంగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. కంపెనీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఇదో అవకాశమన్నారు. కేవలం సమీక్షకు మాత్రమే కాకుండా ఉద్యోగుల అనుభవాల్ని కూడా పరిగణలోకి తీసుకొని సంస్థను మరింత ఉన్నత స్థానంలోకి తీసుకెళతామని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.