ఏపీ మంత్రుల మ‌ధ్య ఆసక్తికరమైన చర్చ

రాజ‌కీయాల్లో చాలా విష‌యాలు ఆస‌క్తిగా ఉంటాయి. అవి ప్ర‌జ‌ల‌కు నేరుగా సంబంధించిన‌వి అయినా.. కాక పోయినా.. నేత‌లు చేసే వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మార‌తాయి. ఇలానే తాజాగా వైసీపీ కీల‌క నాయ‌కుడు, తూర్పు గోదావ‌రికి చెందిన‌ మంత్రి ఒక‌రు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సాధార‌ణంగా.. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులంటే నే నేత‌లు విరుచుకుప‌డుతుంటారు. ఇది స‌హ‌జం కూడా. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు.. ప్ర‌త్య‌ర్థుల‌ను కార్న‌ర్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఎక్క‌డ అవ‌కాశం ఉంటే.. అక్క‌డ వారిని విమ‌ర్శించేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అంతేకాదు.. ప్ర‌త్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడేవారిని ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వ‌రు.

అది ఆఖ‌రుకు మీడియా అయినా.. వ్య‌క్తులు అయినా.. ఒక్క‌టే. గ‌తంలో సీఎం జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం స్వీకారం చేసే స‌మ‌యంలో ఒక వ్యాఖ్య చేశారు. “ఆంధ్ర‌జ్యోతి, ఈనాడుల‌ను చ‌ద‌వ‌మాకండి. అవి రాసేవి, ప్ర‌సారం చేసేవి కూడా చూడ‌మాకండి.. చ‌ద‌వ‌మాకండి!. అందులో అన్నీ త‌ప్పుడు క‌థ‌నాలు.. చంద్ర‌బాబుపై పొగ‌డ్త‌లు మాత్ర‌మే ఉంటాయి. ఇప్ప‌టికిప్పుడు చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కాలేద‌ని.. ఆ మీడియా క‌న్నీరు పెడుతోంది. అందుకే మ‌న‌పై బుర‌ద జ‌ల్లుడు కార్య‌క్ర‌మం చేస్తున్నారు“ అని వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ నాయ‌కులు కూడా ఆ మీడియాకు దూరంగా ఉంటున్న‌ట్టుగా త‌ర‌చుగా సీఎంకు చెబుతున్నారు.

త‌ద్వారా.. ఆయ‌న ద‌గ్గ‌ర మార్కులు వేయించుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఇటీవ‌ల ఈ రెండు మీడియాల‌ను.. వైసీపీ నేత‌లు ఎక్కువ‌గా ఫాలో అవుతున్నార‌ని.. వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు.. ఈ రెండు మీడియాల్లో వ‌స్తున్న వ్య‌తిరేక వార్త‌ల‌కు నాయ‌కులు, అధికారులు కూడా రియాక్ట్ అవుతున్నారు. అది త‌ప్పు.. ఇది కాదు.. అంటూ.. వివ‌ర‌ణ ఇస్తున్నారు. దీనిపైనే మంత్రి వ‌ర్యులు ఆస‌క్తిగా స్పందించారు.

“ఇది స‌హజం. పైకి అలానే అంటాం కానీ.. మ‌న గురించి వాళ్లు రాస్తున్న‌ప్పుడు.. వాటిని చ‌ద‌వితేనే క‌దా.. మ‌న త‌ప్పులు తెలిసేది. మ‌నం మాత్ర‌మే ఇలా చేస్తున్నామంటే పొర‌పాటే.. టీడీపీ నేత‌లు.. మ‌న ప‌త్రిక‌ను, మీడియాను నిరంత‌రం ఫాలో అవుతుంటారు. ఇది త‌ప్పుకాదు. మీడియాను అన్ని కోణాల్లోనూ ఫాలో అవ్వాల్సిందే!“ అని చెప్పార‌ట‌. ప్ర‌స్తుతం ఈ విష‌యం.. ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది.