కార్యకర్త పాడె మోసిన చంద్రబాబు

మరో తెలుగుదేశం పార్టీ నేత హత్యకు గురయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు 33 మంది టీడీపీ నేతలు.. కార్యకర్తలు హత్యకు గురి కావటం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో హత్యకు గురైన టీడీపీ నేత తోట చంద్రయ్య భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు స్వయంగా వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన.. హతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. వారిని ఊరడించారు.

చంద్రబాబు రాకతో ఒక్కసారిగా వాతావరణం ఉద్విగ్నంగా మారింది. హత్యకు గురైన వైనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. తమ పార్టీ నాయకులు.. కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోమని.. ముఖ్యమంత్రి జగన్ కు.. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లీని హెచ్చరించారు. గతంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం తన వద్దకు వచ్చిన చంద్రయ్య.. తనను రావాలని కోరారని.. అలాంటి చంద్రయ్యను హత్య చేస్తే ఆయన  డెడ్ బాడీని చూడటానికి రావాల్సి వస్తుందని తానెప్పుడు అనుకోలేదన్నారు. ఈ సందర్భంగా తీవ్రంగా చలించిన చంద్రబాబు.. ఆగ్రహానికి గురయ్యారు. తమ పార్టీ నేతల్ని హత్య చేస్తున్న వైనంపై మండిపడ్డారు. తమ పార్టీ నాయకులపై దాడి చేస్తున్న వారికి సీఎం జగన్ పదవులు ఇస్తున్నట్లు చెప్పారు.

42 ఏళ్ల తోట చంద్రయ్య మృతదేహాన్ని చూసి చలించిన చంద్రబాబు.. తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల విషాదంతో కదిలిపోయారు.ఆయనే స్వయంగా చంద్రబాబు పాడెను మోశారు. అంతకు ముందు చంద్రయ్య భార్య కోటమ్మ.. కుమారుడు వీరాంజనేయులతో మాట్లాడారు. పార్టీ తరఫున తోట చంద్రయ్య కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వారి కుటుంబానికి పార్టీ అండదండలు ఉంటాయని.. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. రాత్రి 8.45 గంటల వరకు సాగిన చంద్రయ్య అంతిమ యాత్రలో పాల్గొన్న చంద్రబాబు.. పార్థిప దేహాన్ని తీసుకెళ్లే ట్రాక్టర్ ట్రాలీలో నిలబడ్డారు. శ్మశానం వరకు వెళ్లి చితి మీద కర్ర పేర్చి నివాళులు అర్పించారు.

అంతకు ముందు మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ నేతల్ని.. కార్యకర్తల్ని 33 మందిని హత్య చేశారన్నారు. అందులో 20 మంది బీసీలు.. ముగ్గురు ఎస్సీలు.. ఇద్దరు ఎస్టీలు.. ఇద్దరు మైనార్టీలు.. ఆరుగురు అగ్రవర్ణాల వారు ఉన్నట్లు చెప్పారు. తమ కార్యకర్తల్ని వైసీపీకి చెందిన వారు హత్య చేస్తుననారని.. అయినా పోలీసు వ్యవస్థ కట్టడి చేయటం లేదన్నారు. చంద్రయ్యకు ఇక్కడ వేరే గొడవలులేవని.. రాజకీయంగా ప్రత్యర్థిగా ఉండటమే ఆయన హత్యకు కారణమైందన్నారు. చంద్రయ్య ఆత్మకు శాంతి చేకూరాలంటే.. ఆయన్నుచంపిన వారిని శిక్ష పడాలన్నారు. రెండేళ్ల తర్వాత వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని.. హత్యా రాజకీయాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న చంద్రబాబు.. తాజా ఉదంతంలో తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు