ఒక్క ట్వీట్‌తో మొత్తం పాయె..

కొన్నేళ్లుగా సినిమాలతో కంటే తన ట్వీట్లతో ఎక్కువ పాపులారిటీ సంపాదించాడు తమిళ నటుడు సిద్దార్థ్. నిజానికి అతను సినిమాల్లో అతడి పాపులారిటీ తగ్గుతూ వస్తోంది తప్ప పెరగట్లేదు. అతను ఎప్పుడు హిట్టు కొట్టాడో జనాలు కూడా మరిచిపోయారు. తెలుగు సినిమాలకు దూరమై తమిళంలో ‘జిగర్ తండ’ లాంటి సినిమాలతో కాస్త సందడి చేశాడు కానీ.. అక్కడ కూడా వరుస ఫ్లాపులు రావడంతో మార్కెట్ బాగా పడిపోయి.. సినిమాలు తగ్గిపోయి.. మొత్తంగా నటుడిగా అతను ఇన్ యాక్టివ్ అయిపోయాడు.

ఈ మధ్య ‘మహాసముద్రం’ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఐతే సినిమాల సంగతి ఎలా ఉన్నప్పటికీ సామాజిక అంశాల మీద.. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదునైన ట్వీట్లు వేస్తూ లైమ్ లైట్లో సాగుతున్నాడు సిద్ధు. మోడీని, బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్లకు సిద్ధు ట్వీట్లు భలే సమ్మగా ఉంటాయి.

వాటిని వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. సిద్ధు సెటైరికల్ ట్వీట్లలో ఒక స్టైల్ ఉంటుంది. అది ప్రత్యర్థులకు చురుగ్గా తగులుతుంటుంది. ఇలాంటి ట్వీట్లతో ఓ వర్గంలో బాగా ఆదరణ సంపాదించుకున్నాడు సిద్ధు. ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమకు ఇబ్బందిగా మారిన ఏపీ టికెట్ల ధరల వ్యవహారం మీదా బోల్డ్ కామెంట్లు చేశాడు సిద్ధు. 

ఐతే ఇన్ని రోజులు ట్విట్టర్లో అతను సంపాదించుకున్న ఆదరణ మొత్తం ఒకే ఒక్క ట్వీట్‌తో మట్టి కొట్టుకుపోయింది. అతడి మద్దతుదారులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు ఆ ట్వీట్‌ను. ప్రధాని మోడీకి మద్దతుగా షట్లర్ సైనా నెహ్వాల్ వేసిన ట్వీట్‌ మీద సెటైర్ వేయబోయి ‘సటిల్ కాక్ ప్లేయర్’ అనే మాట వాడటం సిద్ధు ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింది. ఈ ట్వీట్‌కు ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని అతను ఊహించలేదు.

ముందు ఆ ట్వీట్‌ను కవర్ చేస్తూ ఇంకో ట్వీట్ వేసి మరింతగా అబాసుపాలైన అతను.. తనపై నెగెటివిటీకి భయపడుతూ క్షమాపణ లేఖ రాయాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా అతడి పట్ల వ్యతిరేకత ఏమీ తగ్గలేదు. ఎప్పుడూ సిద్ధుకు మద్దతుగా నిలిచేవాళ్లు కూడా ఇప్పుడు వ్యతిరేకంగా మారిపోయారు.  చూస్తుంటే ఇన్నాళ్లు సంపాదించుకున్న ఆదరణ అంతా ఈ ట్వీట్‌తో పోగొట్టుకున్నట్లే ఉన్నాడు సిద్ధు.