గాయాలు గుర్తు చేస్తున్న సిమ్రాన్


సిమ్రాన్.. 90వ దశకం చివరి నుంచి ఒక పదేళ్ల పాటు దక్షిణాది సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపిన హీరోయిన్. అప్పట్లో ఇండియాలో ఆమె టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు ఎదురే లేదసలు. పర్ఫెక్ట్ ఫిగర్‌కు బాగా నటించగల నైపుణ్యం కూడా ఉన్న ఆమెకు సాటి వచ్చే హీరోయిన్లు కనిపించే వారు కాదు. ఇప్పటి టాప్ హీరోయిన్లను సిమ్రాన్‌తో పోల్చి చూసినా.. ఆమె ముందు వాళ్లు తూగలేరంటే అతిశయోక్తి కాదు.

ఇటు తెలుగులో, అటు తమిళంలో టాప్ స్టార్లలో భారీ చిత్రాల్లో నటించింది సిమ్రాన్. కెరీర్ చరమాంకంలో పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైన సిమ్రాన్.. కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత తమిళంలో లీడ్, క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. ‘పేట’ సహా కొన్ని పెద్ద సినిమాల్లో ఆమె నటించిన సంగతి తెలిసిందే. తమిళంలో ఇప్పటికీ బిజీగా ఉన్న సిమ్రాన్.. తెలుగులో మాత్రం మళ్లీ కనిపించట్లేదు.

ఐతే మళ్లీ తనను తెలుగు సినిమాలకు కన్సిడర్ చేయాలని హింట్స్ ఇస్తోందో ఏమో తెలియదు కానీ.. కొన్ని రోజులుగా తాను నటించిన సినిమాల వార్షికోత్సవాల్ని పురస్కరించుకుని చాలా ఉత్సాహంగా, ఎమోషనల్‌గా ట్వీట్లు వేస్తోంది సిమ్రాన్. ఐతే సూపర్ హిట్లు, బ్లాక్‌బస్టర్ల వార్షికోత్సవాలపుడు వాటిని గుర్తు చేసుకుంటూ ట్వీట్లు వేస్తే బాగానే ఉంటుంది కానీ.. మరిచిపోదగ్గ చిత్రాలకు ఇలా ఎమోషనల్ అవుతూ ట్వీట్లు వేస్తేనే జనాలకు రుచించదు. ఉదాహరణకు మొన్న ‘ఒక్కమగాడు’ సినిమాను గుర్తు చేసుకుంది సిమ్రాన్. నందమూరి అభిమానులకు అదెంతటి చేదు జ్ఞాపకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమాను కొనియాడుతూ ట్వీట్ వేయడం బాలయ్య అభిమానులకు ఇబ్బందిగా మారింది. అలాగే మరో సంక్రాంతి బాలయ్య సినిమా ‘సీమ సింహం’ గురించి కూడా ఇలాగే ట్వీట్ వేసింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే.

సిమ్రాన్ చిరంజీవి అభిమానులను సైతం విడిచిపెట్టలేదు. తాజాగా ‘మృగరాజు’ వార్షికోత్సవం నేపథ్యంలో ఆ సినిమాను గుర్తు చేసింది. చిరు అభిమానులకైతే ఈ చిత్రం మామూలు షాక్ కాదు. సంక్రాంతి టైంలో ‘నరసింహనాయుడు’కు పోటీగా వచ్చి దాని ముందు చతికిలపడటంతో అప్పట్లో చిరు అభిమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మరి ఇలాంటి గాయాలను సిమ్రాన్ ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో?