వచ్చే వేసవికే ప్రాజెక్ట్-K

ప్రభాస్ ప్రస్తుతం లైన్లో పెట్టిన మూణ్నాలుగు భారీ సినిమాల్లో ముందుగా అనౌన్స్ చేసింది ‘ప్రాజెక్ట్-కె’నే. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సీనియర్ నిర్మాత అశ్వినీదత్ తన ‘వైజయంతీ మూవీస్’ బేనర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ‘ప్రాజెక్ట్-కె’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఐతే ప్రకటన చేశాక సినిమా పట్టాలెక్కడానికి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ప్రి ప్రొడక్షన్ వర్క్ భారీ ఎత్తున చేయాల్సి ఉండటంతో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరిగింది.

మధ్యలో ‘రాధేశ్యామ్’తో పాటు ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్‌ను కూడా పూర్తి చేసేశాడు ప్రభాస్. ‘సలార్’ సినిమా కూడా దాదాపు అవగొట్టేశాడు. ఎట్టకేలకు కొన్ని నెలల కిందట ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టుకుంది. కాస్త వేగంగానే రెండు షెడ్యూళ్లు పూర్తి చేశారు. మూడో షెడ్యూల్ మొదలుపెడదాం అనుకునే సమయానికి కరోనా థర్డ్ వేవ్ వచ్చి పడింది. షూటింగ్ ఆపేశారు. ఈ సినిమా స్కేల్, ప్రభాస్ వేరే కమిట్మెంట్ల దృష్ట్యా ‘ప్రాజెక్ట్-కె’ చాలా ఆలస్యం అవుతుందని.. ఇంకో రెండేళ్లకు కానీ విడుదల కాదేమో అన్న అంచనాతో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

కానీ నిర్మాత అశ్వినీదత్ మాత్రం అంత కాలం ఎదురు చూడాల్సిన పని లేదని అంటున్నాడు. వచ్చే ఏడాది వేసవికే ‘ప్రాజెక్ట్-కె’ను విడుదల చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆయన వెల్లడించాడు.‘ప్రాజెక్ట్-కె’ షూట్, రిలీజ్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘‘ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. పరిస్థితులు సహకరిస్తే ఈ నెలాఖర్లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం.

ఈ షెడ్యూల్‌లో అమితాబ్, దీపికా పాల్గొనబోతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే వేసవిలో చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తాం’’ అని ఆయన తెలిపారు. ఐతే ‘రాధేశ్యామ్’ లాంటి మామూలు సినిమానే రెండేళ్లకు పైగా చిత్రీకరణ జరుపుకుని ఇంకా విడుదల కోసం వేచి చూస్తోంది. కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే పోయేలా లేదు కాబట్టి వచ్చే ఏడాది చివరికి ‘ప్రాజెక్ట్-కె’ రిలీజైనా చాలనుకుంటున్నారు అభిమానులు.