యంగ్‌ టైగర్‌‌తో యాంగ్రీ స్టార్

యాంగ్రీ యంగ్‌మేన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన నాటి నుంచి రకరకాల పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ వచ్చారు రాజశేఖర్. మధ్యలో కొన్నాళ్లు వరుస పరాజయాలతో వెనకబడిపోయారు. దాంతో ఆయన పని అయిపోయింది అనుకున్నారంతా. కానీ ‘గరుడవేగ’ సినిమాతో యాంగ్రీ స్టార్‌‌గా అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చారాయన. ఆ తర్వాత ‘కల్కి’ మూవీ ద్వారా మరింత ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం మలయాళ చిత్రం ‘జోసెఫ్‌’ రీమేక్ ‘శేఖర్‌‌’లో నటిస్తున్నారు.      

హీరోగానే కాదు.. అవకాశం వస్తే ఇంపార్టెంట్‌ రోల్స్‌తో పాటు విలన్‌గానూ నటించడానికి రెడీ అని సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు శేఖర్. దాంతో కొందరు ఆయనకి కొన్ని పాత్రలు ఆఫర్ చేశారట కూడా. కానీ ఏదీ ఎక్సయిట్‌ చేయకపోవడంతో ఆయన నో అన్నారని టాక్. అయితే ఇన్నాళ్లకి రాజశేఖర్ కోరిక తీరనున్నట్టు తెలుస్తోంది.     

ఓ స్టార్‌‌ హీరో సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారట రాజశేఖర్. ఆ హీరో ఎవరో కాదు.. ఎన్టీఆర్. ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’ తర్వాత సినిమా చేయడానికి కొరటాల శివని లైన్‌లో పెట్టాడు తారక్. హీరోయిన్‌గా కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. ఇందులో హీరోకి బాబాయ్ పాత్ర ఒకటి ఉందట. అది చాలా పవర్‌‌ఫుల్‌గా ఉంటుందట. దానికి రాజశేఖర్ అయితే యాప్ట్ అని మేకర్స్ ఫీలయ్యారని, శేఖర్ కూడా ఓకే అన్నారని ప్రచారం జరుగుతోంది.       

వాస్తవానికి ఈ సినిమాని ఈ యేడు ఏప్రిల్ 22న విడుదల చేయాల్సి ఉంది. కానీ తారక్‌ ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’కి, కొరటాల ‘ఆచార్య’కి లాక్ అయ్యి ఉండిపోవడంతో ఇంతవరకు మూవీ సెట్స్‌కి వెళ్లలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఒకవేళ రాజశేఖర్‌‌కి సంబంధించిన బజ్ నిజమైతే కనుక ప్రాజెక్ట్‌కి ఆయన అడిషనల్ అట్రాక్షన్ అవుతారనడంలో సందేహమే లేదు. విభిన్న పాత్రల్లో కనిపించాలనే రాజశేఖర్‌‌ కోరికని తారక్, కొరటాల కలిసి తీరుస్తారేమో చూడాలి మరి.