షర్మిల పార్టీ గురించి బొత్స షాకింగ్ కామెంట్స్

అధికార వైసీపీలో ఒక్కొక్కళ్ళు వైఎస్ షర్మిల పార్టీపై మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు మంత్రులు, సీనియర్ నేతలు, ప్రజా ప్రతినిధులు ఎవరు కూడా షర్మిల గురించి మాట్లాడటానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే రెండుసార్లు కామెంట్లు చేశారు. మిగిలిన వారిని మీడియా అడిగినా మౌనంగా సమాధానంగా చెప్పేవారు. తాజాగా మంత్రి బొత్సా సత్యనారాయణ మాట్లాడుతూ షర్మిల ఏపీలో పార్టీ పెట్టినా తమకొచ్చే నష్టం ఏమీలేదన్నారు.

ఇప్పటికే ఏపీలో ఉన్న పది పార్టీల్లో షర్మిల పార్టీ కూడా ఒకటవుతుందంతే అని చాలా తేలిగ్గా కొట్టి పడేశారు. అసలు షర్మిల ఏపీలో పార్టీ పెడుతుందో లేదో కూడా ఎవరికీ తెలీదు. పార్టీ పెడతానని ఆమె ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. తెలంగాణలో వైఎస్సార్టీపీ పెట్టి ఉనికి కోసమే నానా అవస్థలు పడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. షర్మిల పార్టీని రాజకీయ పార్టీలతో పాటు మామూలు జనాలు కూడా పెద్దగా పట్టించుకోవటంలేదు.

తెలంగాణలో పార్టీ పెట్టే ముందు ఎలాంటి వ్యూహాలు పన్నారో ? ఏమాలోచించి పార్టీ పెట్టారో ఆమెకే తెలియాలి. పార్టీ పెట్టిందగ్గర నుండి ఇప్పటివరకు ఆమె పార్టీలో షర్మిల తప్ప జనాలందరికీ తెలిసిన రెండో నేత లేకపోవటం ఆశ్చర్యమే.  పార్టీ పెట్టకముందు తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో షర్మిల ప్రభావం బాగానే ఉంటుందని అనుకున్నా ఇఫుడు అలాంటిదే కనబటం లేదు. దాంతో నిరుద్యోగ దీక్షలని, పాదయాత్రలని ఉనికిని చాటేందుకే అవస్థలు పడుతున్నారు.

ఈ పరిస్థితుల్లో ఏపీలో పార్టీ పెట్టడమంటే అనుమానంగానే ఉంది. ఏపీలో పార్టీ పెడతారా అని మీడియా అడిగినపుడు పెట్టకూడదని రూలేమన్నా ఉందా అని ఎదురు ప్రశ్నించారంతే. అంతేకానీ ఏపీలో కూడా పార్టీ పెడతానని ఎక్కడా చెప్పలేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక మీడియా మాత్రం షర్మిలకు బాగా హైప్ ఇస్తున్నది. జగన్ వ్యతిరేక మీడియాను నమ్ముకుని షర్మిల ముందుకు అడుగులు వేస్తే తనంత తానుగా చెత్త నెత్తేసుకున్నట్లే.