జ‌గ‌న్ ఇమేజ్.. వైసీపీని కాపాడుతుందా?

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ రాజకీయ వ్యూహాకర్తగా ప్రశాంత్ కిషోర్(పీకే) పని చేశారు. ఆ ఎన్నికల్లో జగన్ ఇమేజ్ కు తోడు పీకే వ్యూహాలు పనిచేశాయి. ముఖ్యంగా ఒక్క ఛాన్స్‌.. పాద‌యాత్ర వంటివి వైసీపీకి ప్ల‌స్ అయ్యాయి. గత ఎన్నికల్లో జగన్ వేవ్ తుఫానులా కొనసాగడంతో ప్రతిపక్ష పార్టీలు అడ్ర‌స్ కోల్పోయాయ‌నే చెప్పాలి. వైసీపీకి ఏకంగా 151 సీట్లు రాగా, టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. జనసేనకు ఒక్క సీటు మాత్రమే వచ్చింది. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల మాటేంటి?  జ‌గ‌న్ వేవ్ ప‌నిచేస్తుందా?  లేక‌.. పీకే వ్యూహం వ‌ర్క‌వుట్ అవుతుందా? అనేది వైసీపీలో చ‌ర్చ‌గా మారింది.

జ‌గ‌న్‌ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు పూర్తి అయ్యాయి. ఈ రెండున్నరేళ్లలో ఆయన సంక్షేమ కార్యక్రమాలపైనే ఫోకస్ పెట్టారు. దీంతో అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వం నుంచి ఏదోఒక లబ్ధి అందేలా చూశారు. అయితే.. ఇవి కొన్ని ప‌క్క‌దారి ప‌ట్టిన సంద‌ర్భాలు కూడా క‌నిపిస్తున్నాయి. ఇదిలావుంటే.. జగన్ అధికారంలోకి వచ్చాక  జ‌రిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీనే విజ‌యం సాధించింది. ప్రతిపక్షాలు పోటీ ఇవ్వడం లేదు. ప్రతి ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుంటే ప్రజలంతా ఆయన వెంటే ఉన్నట్లు కన్పిస్తోంది.

ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ మ‌రింత పెరిగింద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ ఇమేజ్‌కు తోడు.. మ‌రోసారి ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహం తోడైతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ విజ‌యం ద‌క్కుతుంద‌ని నేత‌లు భావిస్తున్నారు. ఇక‌, ఇప్ప‌టికే పీకే టీం రంగంలోకి దిగాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. ఈ నెల‌ త‌ర్వాత‌.. రాష్ట్రంలో అడుగు పెట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గాన్ని జ‌ల్లెడ ప‌ట్టి.. ప్రజాప్ర‌తినిధుల ప‌నితీరును అంచ‌నా వేయ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల నాడిని కూడా ప‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేయ‌నుంది. దీని ఆధారంగానే నేత‌ల‌కు సీట్లు ల‌భించ‌నున్నాయి.  

కొన్ని నెల‌ల కింద‌ట  విశాఖలో ప‌ర్య‌టించిన పీకే బృందం  పలు అంశాలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంది. అప్ప‌ట్లో విశాఖ‌ను రాజ‌ధానిగా ప్ర‌క‌టించేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మైన నేప‌థ్యంలో ఇక్క‌డి ప్ర‌జ‌లు ఏమ‌నుకున్నార‌నే విష‌యాన్ని తెలుసుకుంది. నేతల పనితీరు, ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు? అనే అంశాలపై సర్వే చేపట్టారు. అలాగే ప్రభుత్వ అధికారులు ప్రజలతో వ్యవహరిస్తు న్న తీరుపై సైతం ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నామినేటేడ్ పదవులు ఆశించిన భంగపడిన నేతలు నిరుత్సాహంలో ఉన్నట్లు పీకే టీం గుర్తించిందని సమాచారం.  

కొందరికే పార్టీలో ప్రాధాన్యం దక్కుతుందని ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నవారికి గుర్తింపు ఇవ్వడం లేదని పలువురు బాధపడుతు న్నట్లు తెలుసుకున్నారు. అదేవిధంగా పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి పీకేం టీం క‌నుక రంగంలోకి దిగితే.. వైసీపీ పాల‌న‌పై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నార‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలియ‌నుంది. దీని ఆధారంగానే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని.. మ‌ళ్లీ నూత‌న మేనిఫెస్టోకు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని భావిస్తున్నారు. అయితే..  ఈ సారి జ‌గ‌న్ పై సానుభూతి ఉండ‌దు. కేవ‌లం ఆయ‌న పాల‌న ఆధారంగానే ప్ర‌జ‌లు ఓట్లు వేస్తారు.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను బ‌ట్టి.. జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉంది. అభివృద్ధి లేద‌ని.. ప్ర‌జాధ‌నాన్ని ఒక వ‌ర్గం ప్ర‌జ‌ల‌కే పంచుతున్నార‌ని.. ఆయ‌న పంచుడు పాల‌నే త‌ప్ప‌.. అభివృద్ధి పాల‌న కాద‌నే అభిప్రాయం ఉంది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ఇమేజా.. పీకే వ్యూహ‌మా? ఏది వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌ర్క‌వుట్ అవుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది.