పుస్తకం ఆధారంగా ‘ఆచార్య’..?

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఇందులో రామ్ చరణ్ కీలకపాత్ర పోషించారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావ‌డం అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మిక్స్ చేసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ వాయిదా మీద వాయిదా పడుతూనే ఉంది. 

ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలైతేనే కానీ ‘ఆచార్య’ రాదని అంటున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ‘ఆచార్య’ సినిమా కథ శ్రీకాకుళంలో జిల్లాలో ఎప్పుడో 1970లలో జరిగిన కథ అని అంటున్నారు. ‘సుబ్బారావు పాణిగ్రాహి’ అనే పుస్తకం ఆధారంగా ‘ఆచార్య’ను తెరకెక్కించారట. 

ఒరిస్సాకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి శ్రీకాకుళంలో బొడ్డపాడు అనే గ్రామంలో  శివుడి గుడిలో పూజారిగా ఉంటూ భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. అతడి జీవితం ఆధారంగానే ‘సుబ్బారావు పాణిగ్రాహి’ అనే పుస్తకం రాశారు. సుబ్బారావు తరువాత ఆ ఉద్యమాన్ని అతడి తమ్ముడు హేమచంద్ర పాణిగ్రాహి చేపట్టాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు పేరున్న నక్సలైట్లు సుబ్బారావు చేసే ఉద్యమానికి సపోర్ట్ గా నిలిచేవారు. 

ఈ ఇద్దరు నక్సలైట్లు ఉపాధ్యాయులుగా పని చేసి అక్కడ ప్రజలను చైతన్యవంతులను చేసేవారు. ఇప్పుడు కొరటాల శివ అదే థీమ్ ను తీసుకొని.. సినిమాకి కూడా ‘ఆచార్య’ అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది. చిన్న చిన్న మార్పులతో సుబ్బారావు జీవితాన్ని ‘ఆచార్య’ సినిమాగా తీసినట్లు సమాచారం.