ఏపీ స‌ర్కారుకు మ‌రో సెగ‌

Jagan

ఏపీ స‌ర్కారుకు కొత్త సెగ తగిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు తాము ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చామం టూ.. ప‌దే ప‌దే చెప్పుకొంటున్న వైసీపీ స‌ర్కారుకు పెద్ద ఇబ్బందే వ‌చ్చింది. అదే స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌. గ‌త ఏడాదిన్న‌ర కింద‌ట‌.. ఈ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చిన స‌ర్కారు గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల పేరిట‌.. ఏర్పాటు చేసింది. దీనికి గాను ఉద్యోగుల‌ను కొత్త‌గా నియ‌మించారు. తాజాగా సీఎం జ‌గ‌న్ చేసిన పీఆర్సీ ప్రకటనతో స‌చివాల‌య ఉద్యోగులు.. నిర‌స‌న బాట‌ప‌ట్టారు.

 గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధులు బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారు. అధికారిక వాట్సాప్ గ్రూప్‌ల నుంచి ఎగ్జిట్ కావడంతో ప్రభుత్వ యంత్రాంగంలో అయోమయం నెలకొంది. పే స్కేల్ ఇవ్వడక పోవడంతోపాటు.. త‌మ ప్రొబేష‌న్ పిరియ‌డ్‌ను ఈ ఏడాది జూన్ వ‌ర‌కు పెంచ‌డంపై సచివాలయ సిబ్బంది ఆందోళన బాట పట్డారు. అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి ఉద్యోగులు ఎగ్జిట్ కావడంతో గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో పరిపాలన స్తంభించింది.

వాస్త‌వానికి స‌చివాల‌యాల్లో ప‌నిచేసే కార్య‌ద‌ర్శులు, సెక్ష‌న్ అధికారులు, మ‌హిళా అధికారులు ఇలా అంద‌రికీ గ‌త ఏడాది అక్టోబ‌రులోనే ప్రొబేష‌న్ ప్ర‌క‌టించాలి. అయితే.. ప్ర‌భుత్వం తాత్సారం చేయ‌డ‌మే కాకుండా.. ప్రొబేష‌న్ ప్ర‌క‌టించేందుకు హాజ‌రు స‌హా ప‌రీక్ష‌లు పెడ‌తామ‌ని.. ప్ర‌క‌టించింది. దీనిపై అప్ప‌ట్లో వీరి నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దీంతో కొంత మేర‌కు వెన‌క్కి త‌గ్గిన ప్ర‌భుత్వం ఎలాంటి ష‌ర‌తులు లేకుండానే ప్రొబేష‌న్ ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపింది. అయితే.. స‌మ‌యం గ‌డిచి పోతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు.

దీనికితోడు.. ఈ ఏడాది జూన్ చివ‌రి వ‌ర‌కు ఆగాల‌ని స్వ‌యంగా జ‌గ‌నే చెప్ప‌డంతో ఉద్యోగులు ఉద్య‌మ బాట‌ప‌ట్టారు. అయితే..  వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి హెచ్చరిక మెసేజ్ చేశారు. నిరసన తెలిపే ఉద్యోగులు ముందుగా ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చి అనుమతి తీసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు సమ్మెకు వెళ్లకూడదన్నారు. అధికారుల ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరిక జారీ చేశారు. మ‌రి ఈ నేప‌థ్యంలో ఉద్యోగులు ఏం చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.