ఈ ద‌ఫా ప‌వ‌న్ గెలుపు గ్యారెంటీ.. రాసిపెట్టుకోండి..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త ఎన్నిక‌ల్లో రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు. వాస్త‌వానికి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ వంటి కీల‌క నాయ‌కులు చేయించిన స‌ర్వేలో.. ప‌వ‌న్ ఖ‌చ్చితంగా గెలుస్తార‌ని.. అసెంబ్లీలో అడుగు పెడ‌తార‌ని పేర్కొన్నారు. కానీ, ఆయ‌న విశాఖ‌లోని భీమిలిలోను, ప‌శ్చిమ‌లోని భీమ‌వ‌రంలోనూ.. ప‌రాజ‌యం పాల‌య్యారు. దీంతో ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాల ఆయ‌న‌పై ఐర‌న్‌లెగ్ అనే ముద్ర వేశాయి. అయితే.. ఇప్పుడు స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవి ఎప్పుడు జ‌రిగినా.. ప‌వ‌న్ ఖ‌చ్చితంగా గెలుపు గుర్రం ఎక్కుతార‌ని.. జ‌న‌సేన నేత‌లు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నాయి. మ‌రిదీనికి కార‌ణం ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

గత ఎన్నికల్లో పవన్ విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న తూర్పుగోదావరి నుంచి పోటీ చేయకపోవడం వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని జ‌న‌సేన నేత‌లు అప్ప‌ట్లోనే విశ్లేష‌ణ‌లు చేశారు. ఈ క్ర‌మంలో తాజాగా వ్యూహం మార్చిన పవన్… ఈసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి నుంచే ఖ‌చ్చితంగా బరిలోకి దిగుతారని జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు.

తూర్పులో కాపు సామాజికవర్గం ఓట్లు అత్యధికంగా ఉన్న కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో అయితే బాగుంటుందని పార్టీ కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో అయితే గెలుపు తథ్యమనే ధీమా కూడా పార్టీలో ఉంది. ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా పవన్‌ను ఖ‌చ్చితంగా గెలుపుగుర్రం ఎక్కించుకోవ‌చ్చ‌ని నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే.. నేత‌లు అంత బ‌లంగా ప‌వ‌న్ గెలుపుపై కామెంట్లు చేస్తున్నార‌ని అంటున్నారు. సోష‌ల్ మీడియాలోనూ ఈ ద‌ఫా ప‌వ‌న్ గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, మంత్రి కన్నబాబు అదే పనిగా పవన్‌ను వి మ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. నిజానికి గతంలో చిరు నేతృత్వంలోని ప్ర‌జారాజ్యం పార్టీలో పనిచేసిన‌ కన్నబాబుకు చిరు అప్ప‌ట్లో ప్రాధాన్యం ఇచ్చారు. సామాజిక వ‌ర్గం, స్థానికంగా బ‌ల‌మైన నేత కావ‌డంతో ఆయ‌న‌కు ప్రాధాన్యం పెంచారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్‌ను విమ‌ర్శించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. దీంతో పవన్‌తో సహా జనసేన నేతలు రగిలిపోతున్నారు. అనేకసార్లు పవన్‌ను ఉద్దేశించి కన్నబాబు డ్రామాలు ఆపు.. అన్నింటికీ పవన్ యాక్షనే చేస్తున్నారు అని వ్యాఖ్యానిస్తున్న విష‌యం తెలిసిందే.

జగన్ అంటే పవన్‌కు జలసీ అని.. జగన్‌తో పవన్‌కు పోలికేమిటని? జగన్‌ను చూసి సంస్కారం నేర్చుకో అని కన్నబాబు విమర్శించారు. దీనికి కౌంటర్‌గా పవన్ సైతం అనేకసార్లు కన్నబాబును ఉద్దేశించి గతం మర్చిపోవద్దని.. రా చూసుకుందా అని ప్రతి హెచ్చరిక చేశారు. ఇక కాకినాడ రూరల్‌లో పోటీకి పవన్‌ నిర్ణయం తీసుకుంటే సహకరించడానికి టీడీపీ కూడా సిద్ధమనే సంకేతాలు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీలూ పొత్తు పెట్టుకునే అవ‌కాశం ఉంద‌ని వాద‌న వినిపిస్తున్న నేప‌థ్యంలో టీడీపీ కూడా ప‌వ‌న్‌కు ఇక్క‌డ స‌హ‌క‌రించే ఛాన్స్ క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం కాకినాడ రూరల్‌లో టీడీపీకి నియోజకవర్గ ఇన్‌చార్జి లేరు. భర్తీ చేసే ఆలోచనను కూడా పార్టీ పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది. భవిష్యత్తులో టీడీపీ- జనసేన పొత్తు కుదిరితే… ఈ స్థానం జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒకవేళ ఇది కాకపోతే కాకినాడ సిటీ స్థానం కూడా వదులుకోవడానికి టీడీపీ అంతర్గతంగా సన్నాహాలు చేసుకుంటోందని అంటున్నారు. తద్వారా కన్నబాబు, ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిపై పవన్ రూపంలో ప్రతీకారం తీర్చుకోవచ్చనే ఆలోచన టీడీపీలో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే జ‌న‌సేన నేత‌లు అంత ధీమా వ్య‌క్తం చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.