నిరుద్యోగుల‌కు `జ‌గ‌న‌న్న హ్యాండ్‌!`

రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య‌.. నానాటికీ పెరుగుతూనే ఉంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యానికి రాష్ట్రంలో 8 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు ఉన్న‌ట్టు అంచ‌నా వేశారు. ఈ క్ర‌మంలోనే అప్ప‌టి పాద‌యాత్ర స‌మ‌యంలో వైసీపీ అధినేత‌గా.. జ‌గ‌న్  నిరుద్యోగుల‌కు కొన్ని హామీలు ఇచ్చారు. తాను అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే 90 వేల ఖాళీ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తాన‌ని హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు పూర్త‌యి నా.. కేవ‌లం వ‌లంటీర్లు, స‌చివాల‌య ఉద్యోగాల‌తోనే స‌రిపుచ్చారు.

వీటిలోనూ వ‌లంటీర్ల‌ను ప్ర‌భుత్వ‌మే.. స్వ‌చ్ఛంద ఉద్యోగుల‌ని.. ఎప్పుడైనా వారిని ఇంటికి పంపేయొచ్చ‌ని ప‌దేప‌దే చెప్పిన విష‌యం తెలిసిందే. అంటే.. వాటిని ఉద్యోగాలుగా ప‌రిగ‌ణించే అవకాశం లేదు. అంటే.. ఇక‌, మిగిలింది స‌చివాల‌య ఉద్యోగులు మాత్ర‌మే. మ‌రి ఇత‌ర‌త్రా పోస్టుల మాటేమిటి?   డీఎస్సీ అస‌లు వేయ‌నేలేదు. క‌ళాశాల‌ల్లో లెక్చ‌ర‌ర్ల ఊసే ఎత్త‌డం లేదు. మ‌రి ఆయా పోస్టుల ప‌రిస్థితి ఏంటి?  జ‌గ‌న‌న్న‌పై నిరుద్యోగులు పెట్టుకున్న ఆశ‌లు తీరుతాయా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఎందుకంటే.. తాజాగా ఉద్యోగుల రిటైర్మెంట్ వ‌య‌సును పెంచారు.

ఫ‌లితంగా నిరుద్యోగుల‌కు మ‌ళ్లీ వేచి చూసే ప‌రిస్థితి వ‌చ్చింది. కొత్త ఉద్యోగాలు కావాలంటే.. ఇప్పుడున్న ఉద్యోగులు ఖాళీ చేస్తేనే క‌దా! కానీ, ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో..  నిరుద్యోగుల‌కు మేలు జ‌ర‌గ‌క‌పోగా.. వారిని మ‌రింత బాధించేలా మారింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికే రెండున్న‌ర‌ సంవ‌త్స‌రాల త‌ర్వాత కూడా వైసీపీ ప్ర‌భుత్వం ఏపీపీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చింది లేదు.

ఒక డీఎస్సీని ప్ర‌క‌టించింది లేదు. పోలీసు రిక్రూట్‌మెంట్ల ప‌రిస్థితి కూడా అంతే. జూనియ‌ర్ కాలేజీల్లో పోస్టులు, ప్రొఫెస‌ర్ ఖాళీలు.. ఇలా అనేక రూపాల్లో ఖాళీలు ఉన్నా.. భ‌ర్తీ చేయ‌డం లేదు. ఇక‌, ఇప్పుడు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు పెంపుతో ఈ జాప్యం మ‌రో రెండేళ్లు సాగే ఛాన్స్ క‌నిపిస్తోంది. దీనివ‌ల్ల‌.. నిరుద్యోగు ల‌కు జ‌గ‌న్ చేసింది ఏంటి? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. నిరుద్యోగుల‌ను నిట్ట‌నిలువునా ముంచార‌ని.. రాష్ట్ర నిరుద్యోగ సంఘం నాయ‌కులు ఆరోపిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఉద్య‌మాల‌కు కూడా రెడీ అవుతున్నారు. మ‌రి దీనిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎలా స‌మ‌ర్ధించుకుంటుందో.. నిరుద్యోగుల‌పై అప్ప‌ట్లో కురిపించిన వ‌రాలను ఎలా స‌ర్దుబాటు చేస్తుందో చూడాలి.