RRR ధైర్యం వెనుక అస‌లు రీజ‌న్?

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ రాజు.. త్వ‌ర‌లోనే త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. త‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయించేందుకు ఇంకెంత స‌మ‌యం కావాలంటూ. ఆయ‌న వైసీపీ నేత‌ల‌ను ప్ర‌శ్నించారు. వాస్త‌వానికి ఆయ‌న రాజీనామా కోసం.. వైసీపీ నేత‌లు కొన్నాళ్లుగా డిమాండ్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు.. సోష‌ల్ మీడియాలో తీవ్ర విమ‌ర్శ‌లు కూడా చేశారు. కానీ, అప్ప‌ట్లో అస‌లు త‌న ప‌ద‌వికి ఎందుకు రిజైన్ చేయాలి? అని నిల‌దీసిన ర‌ఘురామ.. ఇప్పుడు ఎవ‌రూ కోర‌కుండానే సంచ‌న‌ల ప్ర‌క‌ట‌న చేశారు.

మ‌రి ర‌ఘురామ చేసిన ప్ర‌క‌ట‌న వెనుక అస‌లు ఏం జ‌రిగింది? ఎందుకు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఆర్ ఆర్ ఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌లో మ‌రో మ‌ర్మం కూడా ఉంది. త్వ‌ర‌లోనే తాను రాజీనామా చేస్తాన‌ని చెప్పిన ఆయ‌న.. ఎన్నిక‌ల‌కు వెళ్తాన‌ని.. అది కూడా రాజ‌ధాని అమ‌రావ‌తి అజెండాతో ముందుకు సాగుతాన‌ని చెప్పడం గ‌మ‌నార్హం. అయితే.. దీనివెన‌క‌.. ర‌ఘురామ ధైర్యం ఏంటి? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ఏపీలో వైసీపీ పాల‌న‌పై కొన్ని నెల‌లుగా పెరుగుతున్న వ్య‌తిరేక‌త ఇప్పుడు ఒక స్థాయికి చేరింద‌ని అంచ‌నాలు వ‌స్తున్నాయి.

ముఖ్యంగా అన్ని వ‌ర్గాల్లోనూ అసంతృప్తి పెరిగిపోయింద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. పైకి బాగున్న‌ట్టు క‌నిపించినా.. క్షేత్ర‌స్థాయిలో అన్ని సామాజిక వ‌ర్గాలు ఆవేద‌న‌తోనే ఉన్నాయ‌ని అంటున్నారు. రెడ్డి సామా జికవర్గంలోనూ .. ప్ర‌జ‌లు, దిగువస్థాయి నేత‌ల్లోను వ్య‌తిరేక‌త  పెరిగింద‌ని అంచ‌నా వేస్తున్నారు. అదేవి ధంగా వైశ్య, క‌మ్మ సామాజిక వ‌ర్గాలు కూడా ఆగ్ర‌హంతోనే ఉన్నాయని అంటున్నారు.  ఎస్సీలు కూడా క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి చూసి నివ్వెర పోతున్నారని చెబుతున్నారు. దాడులు.. కేసుల‌తో వేధింపుల‌కు గుర‌వుతున్నామ‌ని వాపోతున్నారు.

వీటికితోడు.. సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా.. ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌ని విశ్లేష‌కులు చెబుతు న్నారు. పెరిగిపోయిన ధ‌ర‌లు.. అందుబాటులో లేని నిత్యావ‌స‌రాలు, క‌రెంటు బిల్లుల బాదుడు, చెత్త ప‌న్ను.. ఇలా అనేక రూపాల్లో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌పై వారు వ్య‌తిరేకంగా ఉన్నార‌ని.. కొన్నాళ్లుగా.. అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు చేసిన పాద‌యాత్ర‌కు అన్ని వ‌ర్గాల నుంచి సానుభూతి పెరిగింది. దీంతో ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని.. ఆర్ ఆర్ ఆర్ భావిస్తున్న‌ట్టు విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ స‌మ‌యంలో ఎన్నిక‌ల‌కు వెళ్తే.. తిరుగులేని విజ‌యం సాధించ‌వ‌చ్చ‌ని.. అంచ‌నా వేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.