‘సార్‌‌’కి ఆదిలోనే అడ్డంకి

కరోనా సెగ ఇండస్ట్రీని కన్‌ఫ్యూజ్ చేసి పారేస్తోంది. ఈ పరిస్థితి ఎంతవరకు ఉంటుందో, ఎప్పటికి పోతుందో తెలియని పరిస్థితి. సినిమా రిలీజులు ఆగిపోయాయి. ఇప్పుడు షూటింగులూ  నిలిచిపోతున్నాయి. స్టార్ హీరోలంతా ఇప్పటికే తమ షెడ్యూల్స్‌లో మార్పులు చేస్తున్నారు. మిగతావారు కూడా పనులు ఆపేసే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ధనుష్‌ ‘సార్’ సినిమా షూటింగ్ మొదలయ్యిందంటూ ఓ ప్రకటన వచ్చింది.

వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్‌‌ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాని ఇటీవలే లాంఛనగా ప్రారంభించారు. ఇప్పుడు షూటింగ్ కూడా మొదలు పెట్టామని అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేశారు. అయితే రేపటి నుంచి ఈ  సినిమా చిత్రీకరణను కూడా ఆపేస్తున్నట్లు తాజాగా తెలిసింది. 

తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో రిస్క్ ఎక్కువ. త్వరలో కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు విధించే చాన్స్ కూడా లేకపోలేదు. పైగా ఇప్పటికే మహేష్‌ బాబు లాంటి స్టార్ హీరోల దగ్గర్నుంచి తమన్ లాంటి టెక్నీషియన్స్ వరకు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. దాంతో తాను కొన్నాళ్లు బ్రేక్ తీసుకోవడం బెటరని ధనుష్ ఫీలయ్యాడట.

ప్రస్తుతం ధనుష్ చేతిలో చాలా సినిమాలున్నాయి. కొన్ని ఆల్రెడీ మొదలయ్యాయి. కొన్ని లైన్‌లో ఉన్నాయి. పక్కా ప్లాన్‌తో వాటిని కంప్లీట్ చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత వర్క్ చేయడం పెద్ద రిస్క్. అందుకే షూటింగ్‌ ఆపుదామని తనే టీమ్‌తో చెప్పాడని, వాళ్లు కూడా సరే అన్నారని, రేపటి నుంచి షూట్‌కి బ్రేక్ ఇచ్చేస్తున్నారని సమాచారం అందుతోంది. రిస్క్ తీసుకోవడం కంటే కాస్త రెస్ట్ తీసుకుని ఫ్రెష్‌గా మొదలుపెట్టడం మంచిదే మరి!