ప్ర‌ధానికి, డేరా బాబాకు తేడా లేదా?: కోర్టు కౌంటర్

వివాదాస్ప‌ద సిక్కు గురువు డేరా బాబాకు 3500 మంది పోలీసుల‌తో భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌న్న పంజాబ్ ప్ర‌భుత్వానికి అక్క‌డి కోర్టులో ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. మ‌రి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఇటీవ‌ల ఎందుకు భ‌ద్ర‌త క‌ల్పించ‌లేక పోయార‌ని.. ప్ర‌శ్నించింది. అంతేకాదు.. ప్ర‌ధానికి, డేరా బాబాకు తేడా లేదా? అని నిల‌దీసింది. విష‌యంలోకి వెళ్తే..

2015లో ఫరీద్కోట్లో గురుగ్రంథ్ సాహిబ్ అపవిత్రమైన ఘటనకు సంబంధించి డేరా బాబా నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే పలు కేసుల్లో హరియాణాలోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్న రామ్ రహీమ్ను గురుగ్రంథ్ కేసు విచారణలో భాగంగా పంజాబ్కు తీసుకురావాలని పంజాబ్లోని ఫరీద్కోట్ కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

3500 మంది పోలీసుల‌తో భారీ బందోబస్తుతో పంజాబ్ తీసుకెళ్లేందుకు అతను వీఐపీనో లేక ప్రధానో కాదని వ్యాఖ్యానించింది. హరియాణా రోహ్తక్లోని సునారియా జైలులో ఉన్న రామ్ రహీమ్ను 3500 పోలీసుల భద్రత మధ్య హెలికాప్టర్లో పంజాబ్ కు తరలిస్తామన్న ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ డీఎస్ పాట్వాలియా వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించింది హైకోర్టు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భాగంగా జరిగిన భద్రతా వైఫల్యాన్ని ప్రస్తావించింది. ప్ర‌ధాని ప‌ర్య‌టించిన‌ప్పుడు రాష్ట్రంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించిం ది. రామ్రహీమ్ను విచారించాలంటే సునేరియా జైలుకు వెళ్లి అతడ్ని కలవాలని పంజాబ్ అధికారులకు సూచించింది.

పంజాబ్ ప్రభుత్వం ఇదివరకే 15 రోజులు గడువు అడిగిందని.. మరోసారి విచారణ వాయిదా వేయాల్సి వస్తే ఎన్నికల తర్వాత నిర్వహించాలని కోర్టుకు నిందితుడి తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్కు వాయిదా వేసింది. అయితే విచారణ తేదీపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే.. కోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను బీజేపీ నేత‌లు.. ఆయుధంగా మార్చుకున్నారు.

వంద‌ల మంది మ‌హిళ‌ల‌పై లైంగిక దాడులు చేశార‌ని.. ఎంతో మంది మ‌హిళ‌ల‌ను నిర్బంధించార‌ని.. అలాంటి బాబాకు 3500 మందితో భ‌ద్ర‌త క‌ల్పిస్తారా?  మ‌రి ప్ర‌జానేత‌, దేశాధి నేత అయిన‌.. మోడీ విష‌యంలో ఎందుకు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉన్నార‌ని..బీజేపీ అగ్ర‌ నాయ‌కులు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.