అంపైర్ కు దడ పుట్టించిన టీమిండియా

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనతో ఆతిథ్య జట్టును బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. కట్టుదిట్టమైన బాల్స్ తో సఫారీ బ్యాట్స్ మెన్లను కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు సెంచూరియన్ లో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. ఇక, జోహాన్స్ బర్గ్ లో రెండో టెస్టులో కూడా మన బౌలర్లు మంచి ప్రదర్శనే చేశారు. అయితే, టీమిండియా ఆటగాళ్ల ఆటతీరు సఫారీ క్రికెటర్లనే కాదు అంపైర్లకూ గుండె దడ పుట్టిస్తోందట.

ఈ విషయాన్ని దక్షిణాఫ్రికాకు చెందిన అంపైర్ మరాయిస్ ఎరాస్మస్ స్వయంగా చెప్పారు. రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో టీమిండియా బౌలింగ్ సందర్భంగా ఎరాస్మస్ చేసిన కామెంట్లు స్టంప్స్ మైక్ లో రికార్డయ్యాయి. మీ అరుపులతో నాకు గుండెపోటు వచ్చేలా ఉందంటూ ఎరాస్మస్ చేసిన కామెంట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శార్దూల్ ఠాకూర్ ఓవర్ వేసిన తర్వాత స్టంప్స్ దగ్గర ఉన్న ఎరాస్మస్ ఈ కామెంట్లు చేయడం విశేషం.

మామూలుగానే మనోళ్లు హిందీలో ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటుంటారు. అయితే, చాలామంది విదేశీ అంపైర్లకు ఆ మాటలు అర్థంకావు. కానీ, వికెట్ల వెనుక నుంచి పంత్ అరిచే అరుపులు…ఎల్బీడబ్ల్యూ కోసం టీమిండియా ఆటగాళ్లు చేసే అప్పీళ్లకు మాత్రం భాష అక్కరలేదు. ఆ అరుపులకే ఎరాస్మస్ బెంబేలెత్తిపోయాడట. బంతి ప్యాడ్లకు తగిలితే చాలు…ఎరాస్మస్ గుండెలు గుభేలుమంటున్నాయట. బౌలర్, కీపర్, స్లిప్ ఫీల్డర్లంతా మూకుమ్మడిగా అప్పీల్ చేసేసరికి బ్యాట్స్ మన్ సంగతి దేవుడెరుగు…ఎరాస్మస్ కు మాత్రం హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైందట.

ఇక, రెండో టెస్టు నాలుగో రోజు ఆటకు వరుణుడు అడ్డుపడ్డాడు. జోహాన్నెస్ బర్గ్ లో ఉదయం నుంచి జల్లులు పడుతుండడంతో ఆట ప్రారంభం కాలేదు. జల్లులు ఏమాత్రం తగ్గకపోవడంతో దాదాపు రెండు సెషన్లు తుడిచిపెట్టుకుపోయాయి. రేపు కూడా వర్షం పడే అవకాశముంది. దీంతో, ఈ మ్యాచ్ లో ఫలితం తేలుతుందో లేదో అన్న ఉత్కంఠ ఏర్పడింది. అయితే, ప్రస్తుతం సఫారీలు మ్యాచ్ గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో భారత అభిమానులు వరుణదేవుడిని వర్షం కురిపించాలని ప్రార్థిస్తున్నారు.

కానీ, వర్షం వల్ల పిచ్ లో తేమ శాతం పెరిగి భారత బౌలర్లకు అనుకూలంగా మారే అవకాశాలూ లేకపోలేదని, ఎల్గర్ తో పాటు వరుసగా రెండు, మూడు వికెట్లు పడితే టీమిండియా సిరీస్ ను సొంతం చేసుకొని చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరిస్తుందని కొందరు అభిమానులు ఆశిస్తున్నారు.