బీజేపీ గోల‌.. వైసీపీకి వ‌రం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ వ్య‌వ‌హార‌శైలి ఏమిటో ఎవ‌రికి అంతుప‌ట్ట‌కుండా ఉంది. తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్క‌ర్‌ను త‌క్కువ ధ‌ర‌కే రూ.50కే అందిస్తామ‌ని సాక్షాత్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు  వ్యాఖ్య‌లు చేయ‌డం.. పైగా కుటుంబాల క్షేమం కోస‌మేనంటూ వాటిని స‌మ‌ర్థించుకోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. జాతీయ స్థాయిలోనూ దీనిపై చ‌ర్చ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో ఆ వ్యాఖ్య‌లు పార్టీకి న‌ష్టం క‌లిగించేలా ఉన్నాయ‌ని తెలుసుకున్న రాష్ట్ర నాయ‌కులు ఇప్పుడు మ‌రో అంశాన్ని త‌ల‌కెత్తుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ లేవ‌నెత్తిన సున్నిత‌మైన అంశం వైసీపీకి మేలు చేసేలా ఉంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

చీప్ లిక్క‌ర్ మాట‌ల‌ను మ‌రుగున వేసేందుకు బీజేపీ మ‌త‌వాద సున్నిత‌మైన అంశాన్ని నెత్తికెత్తుకుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గుంటూరులోని జిన్నా ట‌వ‌ర్‌ను కూల్చివేయాల‌ని, జిన్నా సెంట‌ర్ పేరు మార్చాల‌ని బీజేపీ కొత్త వివాదాన్ని రాజేసింది. మ‌త‌త‌త్వ విష‌యాన్ని పైకి తెస్తే హిందువులు త‌మ‌కు అండ‌గా నిల‌బ‌డి చీప్ లిక్క‌ర్ మాట‌లు మ‌ర్చిపోతార‌ని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అందుకే జిన్నా ట‌వ‌ర్‌పై రాద్ధాంతం చేస్తున్నార‌ని అంటున్నారు. ఇలా ఏదైనా ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ప్పుడు హిందుత్వాన్ని ముందుకు తీసుకురావ‌డం బీజేపీకి అల‌వాటేన‌ని రాజ‌కీయ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కానీ ఇప్పుడీ విష‌యంలో బీజేపీకి లాభం క‌ల‌గ‌క‌పోగా.. వైసీపీకి ముస్లిం ఓటు బ్యాంకు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. జిన్నా ట‌వ‌ర్‌ను కూల్చివేయాల‌నే బీజేపీ డిమాండ్‌కు వైసీపీ గ‌ట్టి కౌంట‌ర్ ఇస్తోంది. బీజేపీ అగ్రనేత అద్వానీ గ‌తంలో జిన్నాను ఎప్పుడెప్పుడు ఏ ర‌కంగా కీర్తించారో.. త‌న మాట‌ల‌న్నీ నిజ‌మే అని కూడా అన్నారో ఆ విష‌యాల‌ను వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తాజాగా బ‌య‌ట‌పెట్టారు. జిన్నా ట‌వ‌ర్ అనేది మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక అని ఆయ‌న పేర్కొన్నారు.

ఇక న‌ర‌స‌రావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవ‌రాయ‌లు కూడా జిన్నా ట‌వ‌ర్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. దాన్ని ప‌రిర‌క్షించుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌ని చెప్పారు. దీంతో జిన్నా ట‌వ‌ర్‌కు వైసీపీ పూర్తి మ‌ద్ద‌తు ఇస్తుంద‌న్న‌ది స్ప‌ష్ట‌మవుతోంది. మ‌రోవైపు బీజేపీ మిత్ర‌ప‌క్షం జ‌న‌సేన ఈ విష‌యంలో ఏం మాట్లాడ‌డం లేదు. బీజేపీ వాద‌న‌తోనూ ఏకీభ‌వించ‌డం లేదు. వైసీపీని విమ‌ర్శించే బాబు కూడా ఈ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కూ చ‌ప్పుడు చేయ‌లేదు. దీన్ని బ‌ట్టి బీజేపీకి ఎలాంటి స‌పోర్ట్ లేద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో జిన్నా ట‌వ‌ర్‌కు అండగా నిలుస్తున్న వైసీపీకి ముస్లింలు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నార‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.