యంగ్ హీరో.. అప్పుడే ఏడో సినిమా

కిరణ్ అబ్బవరం.. ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా అరంగేట్రం చేసిన కుర్రాడు. ‘రాజా వారు రాణి వారు’ అనే చిన్న సినిమాతో అతను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు కానీ.. అమేజాన్ ప్రైమ్‌లో దీన్ని బాగానే చూశారు జనాలు. ఆ గుర్తింపుతోనే వరుసగా అవకాశాలు అందుకున్నాడు.

కిరణ్ రెండో సినిమా ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’కు యూత్‌లో మాంచి క్రేజ్ వచ్చింది. సినిమాలో పెద్దగా విషయం లేకపోయినా దీనికి వచ్చిన ఓపెనింగ్స్ చూసి అంతా షాకైపోయారు. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత బాక్సాఫీస్ డల్లుగా మొదలైన టైంలో ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ గట్టిగా పడ్డాయి తొలి రోజు.

దీంతో యూత్‌లోకి కిరణ్ బాగానే దూసుకెళ్లాడని అర్థమైంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే కొన్ని చిత్రాలను లైన్లో పెట్టిన అతను.. తర్వాత మరిన్ని అవకాశాలు అందుకుంటున్నాడు. కిరణ్ నటించిన సెబాస్టియన్, సమ్మతమే సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ మధ్యే మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలో అతనో సినిమాను మొదలుపెట్టాడు. ఇంతలోనే మరో పెద్ద సంస్థ ఈ యంగ్ హీరోకి ఛాన్సిచ్చింది.

గీతా ఆర్ట్స్-2 బేనర్లో తన తర్వాతి సినిమాను చేయబోతున్నాడు కిరణ్. ఈ రోజే ఈ కాంబినేషన్ గురించి వెల్లడించారు. దీని దర్శకుడు, ఇతర వివరాలను శుక్రవారం పంచుకోనున్నారు. కిరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఏడో సినిమా ఇది కావడం విశేషం. బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కిరణ్.. కెరీర్లో ఇంత వేగంగా ఏడో సినిమాను, అది కూడా ఓ పెద్ద బేనర్లో ప్రకటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.