వైసీపీ ఎంపీపై ట్రోలింగ్ మామూలుగా లేదే!

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌రిద్దరు ఎమ్మెల్యేల దూకుడుతో అధికార పార్టీ వైసీపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. వీరి వ‌ల్ల పార్టీ అధిష్టానం స‌మాధానం చెప్పుకొనే వ‌ర‌కు ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే.. ఇప్పుడు ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌న పెడితే.. ఎంపీ కార‌ణంగా పార్టీ ప‌రువు.. జాతీయ‌స్థాయిలో ఇరుకున ప‌డుతోంద‌ని అంటున్నారు వైసీపీనేత‌లు. ఈ చ‌ర్చ‌.. సొంత పార్టీలోనే జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌నే రాజ‌మండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్. ఉన్న‌త విద్యావంతుడు అయిన మార్గాని.. గ‌త ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆదిలో ఆయ‌న మౌనంగా ఉండేవారు. అయితే.. త‌ర్వాత త‌ర్వాత‌. నోరు విప్ప‌డం ప్రారంభించారు.

సొంత పార్టీలోనే వివాదాల‌కు ఆయ‌న రీజ‌న్ అయ్యార‌నే వ్యాఖ్య‌లు వినిపించ‌డంతో సీఎం జ‌గ‌న్ ఆయ‌న‌ను పిలిచి వారించారు. అయితే త‌ర్వాత ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. చేస్తున్న వ్యాఖ్య‌లు.. ఇప్పుడు జాతీయ‌స్థాయిలో చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. గ‌త లోక్‌స‌భ స‌మావేశాల్లో మార్గాని చేసిన వ్యాఖ్య‌లు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి ఆయుదాల‌ను అందించింది. “రాష్ట్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు జీతాలు చెల్లించ‌లేని ప‌రిస్థితిలో ఉంది. కేంద్ర‌మే ద‌య‌ద‌లిచి ఆదుకోవాలి“ అని లోక్‌స‌భ‌లో మార్గాని వ్యాఖ్యానిం చారు. దీనిపై టీడీపీ ఎంపీలు.. క‌న‌కమేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ కౌంట‌ర్ ఇచ్చారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ఖ‌జానా ఖాళీ అయిపోయింద‌ని.. ఆర్థిక ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాల‌ని అన్నారు. అప్ప‌ట్లో ఈ వ్యాఖ్య‌ల‌ను స‌ర్దిచెప్పుకొనేందుకు పార్టీ స‌హా మార్గాని కూడా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డ్డారు. మ‌రోవైపు.. సోష‌ల్ మీడియాలో నూ ట్రోల్స్ వ‌చ్చాయి. ఇదేంది ఎంపీ సార్‌.. ప్ర‌భుత్వం ప‌రువు తీస్తున్నావే.. అంటూ.. స‌టైర్లు ప‌డ్డాయి. ఈ వ్యాఖ్య‌లు దుమారం అలా ఉంచితే.. తాజాగా మార్గాని చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత దుమారానికి దారితీశాయి.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాల‌తో పేద‌ల‌కు చేతినిండా డ‌బ్బులు వ‌స్తున్నాయ‌ని.. ఆ డ‌బ్బుల‌తో వారు సినిమాలు చూస్తున్నార‌ని.. దీంతో సినిమా పెద్ద‌ల బ్యాంకు ఖాతాలు నిండుతున్నాయ‌ని.. దీనిని అరిక‌ట్టేందుకే.. జ‌గ‌న్ సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించార‌ని ఎంపీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు మ‌రింత దుమారానికి దారితీశాయి. అయ్యా ఎంపీ గారు ఇలాంటి మాట‌ల‌తో మీకు మిమ్మ‌ల‌ను డ్యామేజ్ చేసుకోవ‌డంతో పాటు ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా చేయొద్దు.. అంటూ.. స‌టైర్ల‌తో నెటిజ‌న్లు కుమ్మేస్తున్నారు. ఇప్పుడు భ‌ర‌త్‌పై ట్రోలింగ్ మామూలుగా లేదు. మ‌రి.. ఎంపీ త‌న వ్యాఖ్య‌ల‌పై ఏమంటారో ? చూడాలి.