పేర్ని నాని, వర్మల మధ్య రాజీ

ఏపీలో సినిమా టికెట్ల వివాదం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాకతో రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. మంత్రులు వర్సెస్ వర్మగా జరుగుతున్న మాటల యుద్ధం తార స్థాయికి చేరడంతో సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. వర్మ అడిగిన ప్రశ్నలకు పేర్ని నాని సమాధానాలివ్వడం…దానికి బదులుగా వర్మ మరికొన్ని ప్రశ్నలు సంధించడంతో….ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. చినికి చినికి గాలివానగా మారిన ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనని ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారానికి పుల్ స్టాప్ పెడుతున్నట్లు వర్మ షాకింగ్ ట్వీట్ చేశారు.

ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాలన్నది తమ ఉద్దేశం కాదని, పర్సనల్ గా వైఎస్ జగన్ అంటే తనకు చాలా అభిమానమని వర్మ అన్నారు. కేవలం తమ సమస్యలు తాము సరిగా చెప్పుకోలేకపోవడం వల్లో, లేక, తమ కోణం నుంచి ప్రభుత్వం అర్థం చేసుకోకపోవడం వల్లనో ఈ మిస్ అండర్ స్టాండింగ్ ఏర్పడిందని వర్మ చెప్పారు. ప్రభుత్వం అనుమతిస్తే పేర్ని నానిని కలిసి ఇండస్ట్రీ తరపు నుంచి తమ సమస్యలకు సంబంధించిన వివరణ ఇస్తానని వర్మ అన్నారు. తన వివరణ విన్న తర్వాత ప్రభుత్వపరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నానని వర్మ ట్వీట్ చేశారు.

ఈ క్రమంలోనే వర్మ ట్వీట్ కు పేర్ని నాని కూడా సానుకూలంగా రిప్లై ఇచ్చారు. ‘ధన్యవాదములు వర్మ గారు. తప్పకుండా త్వరలోనే కలుద్దాం’ అని పేర్ని నాని రీట్వీట్ చేశారు. ఆ తర్వాత పేర్ని నాని రిప్లైకు వర్మ వెంటనే వర్మ స్పందించారు. పేర్ని నాని నుంచి సానుకూల స్పందన వచ్చిందని, అందువల్ల ఈ అనవసరమైన వివాదానికి తాను ఇంతటితో ముగింపు పలుకుతున్నానని వర్మ మరో ట్వీట్ చేశారు. దీంతో, వర్మ వర్సెస్ పేర్ని నాని వివాదానికి పుల్ స్టాప్ పడ్డట్లుగానే కనిపిస్తోంది.

మరోవైపు, ఆ ట్వీట్ తర్వాత వర్మ వేరే టాపక్ పై మరో ట్వీట్ చేశారు. అంతిమ్, సత్యమేవ జయతే-2, 83 వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదని, అదే సమయంలో ఒక ప్రాంతీయ భాషా చిత్రమైన పుష్పను జాతీయ స్థాయి చిత్రంగా విజయవంతంగా నిలబెట్టిన అల్లు అర్జున్ కు అభినందనలని వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో వర్మ ఫోకస్ సినిమా టికెట్లపై నుంచి పూర్తిగా మళ్లిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.