ఓటీటీలో ‘రాధేశ్యామ్’.. కండిషన్స్ అప్లై

దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను మరింత నైరాశ్యంలోకి నెడుతూ మరో భారీ చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడగా.. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ సైతం వెనక్కి తగ్గింది. ‘ఆర్ఆర్ఆర్’ వాయిదాపడ్డాక కూడా ‘రాధేశ్యామ్’ సంక్రాంతి విడుదల విషయంలో పట్టుదలగానే ఉంది. కానీ తాజాగా తమిళనాడు, బీహార్ రాష్ష్రాల్లో థియేటర్లను మూత వేయడం, మరిన్ని రాష్ట్రాల్లో ఆంక్షల దిశగా అడుగులు పడుతుండటంతో చిత్ర బృందం మనసు మార్చుకోక తప్పలేదు.

మళ్లీ ఎప్పుడు పరిస్థితులు చక్కబడతాయో.. కొత్త రిలీజ్ డేట్ ఎలా ఎంచుకోవాలో, దానికెంత ఇబ్బంది పడాలో తెలియని అయోమయంలో ఉంది చిత్ర బృందం. ఐతే ఈ చిత్రం ఓటీటీ బాట పట్టే అవకాశాలు లేకపోలేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ ‘ఆర్ఆర్ఆర్’ సమ్మర్ రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. ఆ సీజన్లో వేరే భారీ చిత్రాలు పోటీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బాగా లేటైన ‘రాధేశ్యామ్’ను ఇంకా కొన్ని నెలలు హోల్డ్ చేయలేమని చిత్ర బృందం భావిస్తోందట.

ఈ చిత్రానికి ఓటీటీల నుంచి భారీ ఆఫర్లే వస్తున్నట్లు సమాచారం. ఎంతైనా ఇది మాస్ సినిమా కాదు. వసూళ్లు అంత గొప్పగా ఉండకపోవచ్చనే అంచనాలూ ఉన్నాయి. అలాంటపుడు ఇంకా కొన్ని నెలలు సినిమాను ఆపడం ఎందుకని, ఓటీటీకి ఇచ్చేస్తే ఎలా ఉంటుందని నిర్మాతల్లో ఆలోచన మొదలైనట్లు చెబుతున్నారు. ఈ సినిమాకు రూ.300 కోట్లకు పైగానే ఓటీటీల నుంచి ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.

మరి అంత రేటు పెడితే ఓటీటీలకు గిట్టుబాటు అవుతుందా అనిపించొచ్చు. ఐతే ప్రభాస్ సినిమా అంటే ఉన్న క్రేజ్ దృష్ట్యా సల్మాన్ సినిమా ‘రాధే’ మాదిరే దీన్ని కూడా  పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేయాలని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్  భావిస్తున్నాయట. అలా అయితేనే తమకు వర్కవుటవుతుందని అనుకుంటున్నాయట. కరోనా తీవ్రత అంతకంతకూ పెరిగి, ఇప్పుడిప్పుడే థియేటర్లను తెరుచుకునే అవకాశం కనిపించకపోతే ‘రాధేశ్యామ్’ నిర్మాతలు కూడా ఓటీటీ రిలీజ్ దిశగా టెంప్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.