పవన్ ఓట్ల శాతం పెరిగే ఛాన్స్?

ఏపీలో రాజకీయాలు చూస్తుంటే రేపే పోలింగా అనేటట్లుగా ఉంది. అంత స్పీడయిపోయాయి పాలిటిక్స్. ముఖ్యంగా ఇంతకాలం స్తబ్దుగా ఉన్న కాపు నేతలు పార్టీలకు అతీతంగా వేగం పెంచారు. వరుస భేటీలు జరుగుతున్నాయి.. సంచలన ప్రకటనలు వస్తున్నాయి.. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు అయిదు జిల్లాల్లో కాపు నేతల కదలికలు మహా స్పీడుగా ఉంది.

కాపు నేతలు ఒక్కసారిగా వేగం పెంచడంతో ఊహాగానాలు కూడా ఎక్కువయ్యాయి. వంగవీటి రాధా పార్టీ మారుతారని… ముద్రగడ కొత్త పార్టీ పెడతారని… గంటా కాపు నేతలను ఏకం చేస్తున్నారని… కన్నా లక్ష్మీనారాయణ కీలకంగా వ్యవహరిస్తున్నారని.. ఒకటేమిటి చాలాచాలా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఎవరూ దీనిపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ, చదరంగాన్ని మించిన రాజకీయం జరుగుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాలక పార్టీ గత కొంత కాలంగా జరిపిన రెండు రహస్య సర్వేల్లో గుర్తించిన ప్రభుత్వ వ్యతిరేకత, చేజారిపోతున్న ఓట్ బ్యాంక్ నేపథ్యంలో ఈ సరికొత్త రాజకీయం నడుస్తున్నట్లుగా తెలుస్తోంది.
తెలిసి కొందరు, తెలియక కొందరు కాపు నేతలు ఈ చదరంగంలో పావులవుతున్నారు.

వంగవీటి రాధా సంగతేంటి?

టీడీపీలో ఉన్న వంగవీటి రాధా వైసీపీలోని తన మిత్రులను కలవడం, తన హత్యకు రెక్కీ జరిగిందని ఆరోపించడం.. ఆ తరువాత ప్రభుత్వం గన్ మెన్లను ఇస్తామనడం, వారిని ఆయన తిరస్కరించడం.. అనంతరం చంద్రబాబు సహా టీడీపీ నేతలు రాధా ఇంటికి క్యూ కట్టడం, వారితోనూ ఆయన సానుకూలంగా ఉండడం చూస్తుంటే ఆయన జరుగుతున్న పరిణామాలతో ప్రయాణం చేస్తున్నట్లే ఉంది కానీ ఆయనేమీ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మార్చేసే స్థాయిలో రాజకీయం చేసేలా కనిపించడం లేదు. బలమైన నేపథ్యం, ఆర్థిక బలం, అంగబలం, నిర్దిష్టమైన ఓట్ బ్యాంక్, నమ్మకమైన అనుచరులు అన్నీ ఉన్నా కూడా వంగవీటి రాధాకు అదృష్టం కలిసిరావడం లేదు. ఆయన పాలిటిక్స్‌లో యాక్టివ్ గా ఉన్న సమయంలోనూ మలుపు తిప్పే రాజకీయాలు చేయలేకపోయారు. ఇప్పుడు కూడా సొంతంగా గేమ్ చేంజింగ్ పాలిటిక్స్ చేసే కాన్ఫిడెన్స్, ఉద్దేశం రాధాకు లేవని చెప్పుకోవచ్చు.

ముద్రగడ లెక్కేంటి?

మారిన రాజకీయాల్లో ముద్రగడ కాపు పాలిటిక్స్‌లో పెద్ద మనిషి మాత్రమే. ఆయన్ను ముందు పెట్టి, ఆయన్ను వాడుకుని మిగతావారు లాభపడడమే కానీ ఆయన రాజకీయ ప్రయోజనాలు పొందే పరిస్థితి లేదు. ఆయన బుర్రలో ఆలోచన పుట్టి రాజకీయ పార్టీ పెడితే దాన్ని నడిపేంత వనరులు ఆయన వద్ద లేవు. ఎవరి ప్రోద్బలంతోనైనా పార్టీ పెడితే మాత్రం ఆ లెక్కలు వేరే ఉండొచ్చు. ఆయన తన పాత పరిచయాలన్నీ కదిపి రంగంలోకి దిగితే 10కి పైగా నియోజకవర్గాలలో ఓట్లను చీల్చగలిగే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీ చాలా సీట్లను నిలబెట్టుకుంటుంది.

గంటా శ్రీనివాసరావు….

రాజకీయ అంచనాలను కచ్చితంగా వేసి దానికి అనుగుణంగా అడుగులు వేసి ప్రయోజనాలు పొందే అతికొద్ది మంది నాయకులలో గంటా శ్రీనివాసరావు ఒకరు. 2019 ఎన్నికల సమయంలో మాత్రం ఆయన తన సహజ స్వభావానికి విరుద్ధంగా టీడీపీలోనే ఉండిపోయారు. ఆ తరువాత కొత్త అడుగులు వేసే ప్రయత్నాలు చేసినా అవేమీ సరిగ్గా ఫలించలేదు. ఇప్పుడు మరోసారి గంటా కీలక అడుగులు వేస్తున్నారు. అయితే, ఆ అడుగులు ఎవరి కోసం అనేదే పెద్ద ప్రశ్న. ఎప్పటిలా తన వరకు చూసుకోకుండా మిగతా కొందరు కాపు నేతలనూ సమీకరిస్తూ ఆయన భేటీలు జరుపుతున్నారు. అయితే, ఆయన పెద్ద అడుగులు వేస్తున్నారా? ఇంకెవరైనా పెద్దల కోసం అడుగులు వేస్తున్నారా అనేది కాలక్రమంలో తేలనుంది.