జగన్ డబ్బులు.. సినిమాల పాలు

సినిమా టికెట్లకు సంబంధించిన వ్యవహారం ఏపీలో కొంత కాలంగా ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. రాష్ట్రంలో ఇంకే సమస్యలూ లేనట్లుగా ప్రభుత్వం దీని మీద పెడుతున్న శ్రద్ధా అంతా ఇంతా కాదు. ఓపక్క మంత్రులు.. ఇంకో పక్క అధికారులు ఈ అంశాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లుగా కనిపిస్తున్నారు.

టికెట్ల రేట్ల మీద పాత జీవోను బయటికి తీసి ఆదేశాలు జారీ చేయడం.. ధరల విషయమై థియేటర్ల మీద దాడులు చేయడం.. సమావేశాలు నిర్వహించడం.. ప్రెస్ మీట్లు పెట్టడం.. ధరల విషయమై, అలాగే ఆన్ లైన్ టికెటింగ్‌కు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయడం.. అబ్బో ఈ తతంగం మామూలుగా లేదు.

చివరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం ఈ అంశం మీద నూతన సంవత్సర వేడుకల్లో మాట్లాడటం గమనార్హం. రాష్ట్రంలో జనాల్ని అతలాకుతలం చేస్తున్న ప్రధాన సమస్యల సంగతేంటి అని ఎవరెంత మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా ఈ అంశాన్నే చర్చనీయాంశంగా మారుతున్నారు అధికార పార్టీ నాయకులు. పేర్ని నాని సహా మంత్రులు, ఇతర నాయకులు ఇప్పటికే సినిమా టికెట్ల విషయంలో చిత్ర విచిత్రమైన లాజిక్స్ తీస్తూ మాట్లాడటం తెలిసిందే. ఇప్పుడు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ లైన్లోకి వచ్చారు. ఆయనో చిత్రమైన సూత్రీకరణ చేశారు.

జగన్ సర్కారు ఈ అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడానికి ఆయనో విడ్డూరమైన కారణం చెప్పారు. ఏపీలో సీఎం జగన్ వివిధ పథకాల రూపంలో జనాలకు బాగా డబ్బులు ఇస్తుంటే.. ఆ డబ్బులు అటు తిరిగి ఇటు తిరిగి సినిమా వాళ్ల జేబుల్లోకి వెళ్తున్నాయని భరత్ అన్నారు.

జనాలు బట్టలు, ఇతర విషయాల కోసం కూడా ఖర్చు పెడుతున్నప్పటికీ ఎక్కువ డబ్బులు సినిమాల కోసమే వెచ్చిస్తున్నారని, ఇలా వాళ్ల డబ్బులు వృథా అయిపోతుండటంతోనే టికెట్ల రేట్ల మీద నియంత్రణ తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నట్లుగా మాట్లాడారు ఎంపీ. ఐతే అర్థం లేని ఈ లాజిక్‌తో జనాలకు దిమ్మదిరిగిపోతోంది. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యి భరత్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.