బీజేపీకి కావాల్సింద‌దే!

ప్ర‌స్తుత తెలంగాణ రాజ‌కీయాలు మునుప‌టిలా లేవు. టీఆర్ఎస్ ఆధిప‌త్యానికి క్ర‌మంగా గండి ప‌డుతూనే ఉంది. వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌కు ఇప్పుడు త‌ల‌నొప్పులు త‌ప్ప‌డం లేదు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాలు పుంజుకోవ‌డ‌మే అందుకు కార‌ణం. ముఖ్యంగా బీజేపీ కేసీఆర్‌కు కొర‌క‌రాని కొయ్య‌లా మారింది. ఆ పార్టీ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని భావించిన కేసీఆర్ బీజేపీని ల‌క్ష్యంగా చేసుకున్నార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వ‌రి కొనుగోళ్ల విష‌యంలో కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును దోషిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేశార‌నే టాక్ ఉంది. ఇక ఇప్పుడు రాష్ట్రంలోనూ ఆ పార్టీపై రివేంజ్ తీసుకుంటున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

తాజాగా బండి సంజ‌య్ అరెస్టు రిమాండ్ ఎపిసోడే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ వ్య‌వ‌హార శైలి బీజేపీకే ప్ల‌స్ అవుతుంద‌ని రాజ‌కీయ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బీజేపీకి ప్ర‌జ‌ల్లో సానుభూతి పెరిగే అవ‌కాశం ఉంద‌ని.. సంజ‌య్ జైలుకు వెళ్ల‌డం కేసీఆర్‌కు బూమ‌రాంగ్ అవుతుంద‌నే అంచ‌నాలు క‌లుగుతున్నాయి. బీజేపీకి కూడా ఇదే కోరుకుంటుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఉద్యోగ‌, ఉపాధ్యాయుల బ‌దిలీల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో 317ను స‌వ‌రించాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆ క్ర‌మంలోనే క‌రీంన‌గ‌ర్‌లోని త‌న కార్యాల‌యంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ జ‌గ‌ర‌ణ దీక్ష‌కు దిగ‌గా.. అందుకు అనుమ‌తి లేద‌ని ఆఫీస్ గేటు బ‌ద్ద‌లుకొట్టి మ‌రీ సంజ‌య్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివిధ సెక్ష‌న్ల కింద ఆయ‌న‌పై కేసులు న‌మోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌ర్చ‌గా.. బెయిల్‌ను కొట్టేసిన మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయ‌న్ని క‌రీంన‌గ‌ర్ జిల్లా జైలుకు త‌ర‌లించారు. ఈ సంఘ‌ట‌న‌పై గ‌ల్లీ నుంచి దిల్లీ దాకా బీజేపీ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే 14 రోజుల పాటు రాష్ట్రంలో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేప‌థ్యంలో బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కూడా హైద‌రాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటార‌ని తెలిపింది. కానీ పోలీసులు మాత్రం అందుకు అనుమ‌తి లేద‌ని ఒక‌వేళ ర్యాలీ నిర్వ‌హిస్తే అరెస్ట్ చేస్తామ‌ని చెబుతున్నారు.

ఇప్పుడీ మొత్తం ఎపిసోడ్ బీజేపీకే అనుకూలంగా మారే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఓ ఎంపీని ఇలా అరెస్టు చేయ‌డం ఏమిట‌నే విష‌యాన్ని ఆ పార్టీ ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లింది. కేసీఆర్ నియంతృత్వ పాల‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంతో బీజేపీకే లాభం చేకూరే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇప్ప‌టికే జైల్లో ఉన్న సంజ‌య్‌ను కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్ క‌లిశారు. మ‌రోవైపు రాష్ట్రవ్యాప్తంగా నిర‌స‌న‌లు ఉద్రిక్తం చేసేందుకు బీజేపీ కార్య‌క‌ర్త‌లు సిద్ధ‌మ‌వుతున్నారు.