జగన్: సేమ్ టు సేమ్.. ఏమీ మారలేదు

YS JAgan

సేమ్ టు సేమ్ ఏమీ మారలేదు. రెండున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి  అవే విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి అదే సమాధానం చెబుతున్నారు. విజ్ఞప్తులూ మారలేదు..సమాధానంలోనూ మార్పులేదు.  జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిసిన ప్రతిసారి విజ్ఞప్తులు చేస్తునే ఉన్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. షరామామూలుగానే చాలా విషయాలే మాట్లాడారు.

2017-18 సంవత్సరాల సవరించిన అంచనాల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని 55,657 కోట్లకు ఆమోదించాలని, పెండింగ్ బిల్లులు రు. 2100 కోట్లు వెంటనే మంజూరు చేయించాలన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వని కారణంగా రాష్ట్రం బాగా వెనకబడిపోయిందన్నారు. విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదని గుర్తుచేశారు. విభజన సమయం నుండి ఏపీకి తెలంగాణా విద్యుత్ సంస్ధ నుండి రావాల్సిన రు. 6400 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించాలని..ఇలా చాలానే చెప్పారు.

జగన్ విజ్ఞప్తులను పరిశీలిస్తామని మోడి సమాధానమిచ్చారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఏపీ ప్రయోజనాల్లో ఒక్కటి కూడా నెరవేర్చే ఉద్దేశ్యంలో మోడి లేరన్నది వాస్తవం. ఈ విషయం జగన్ తో పాటు అందరికీ తెలుసు. కావాలనే కేంద్రప్రభుత్వం విభజన హామీలను తుంగలో తొక్కేస్తొంది. విభజన హామీలు తూచా తప్పకుండా అమల్లోకి రావాలంటే మోడీకి ఏపితో రాజకీయ అనివార్యత రావాల్సిందే. ఏపీ ఎంపీలతో అవసరం అనుకుంటే తప్ప రాష్ట్రాన్ని మోడి పట్టించుకోరు.

రాజకీయ అనివార్యత అనేది 2024 ఎన్నికల్లో గానీ తేలదు. అప్పటి ఎన్నికల్లో ఎన్డీయే బలం తగ్గిపోయి ఏపీ ఎంపీల మద్దతు లేనిదే ప్రభుత్వం ఏర్పాటు సాధ్యంకాదు అని తేలినపుడు మాత్రమే ఏపి ప్రయోజనాలు నెరవేరుతాయి. అంతవరకు ఏదో ఢిల్లీకి వెళ్ళటం మోడీని కలవటం నమస్కారం పెట్టుకుని రావటం తప్ప జగన్ చేయగలిగేది ఏమీలేదు. అప్పటివరకు అవే విజ్ఞప్తులు, అవే హామీలు సైకిల్ చక్రంలాగ తిరుగుతునే ఉంటాయంతే.

విచిత్రం ఏమిటంటే రాష్ట్రంలోని బీజేపీ నేతలకు కూడా ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఒప్పించాలని లేకపోవటం. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అయితే రాష్ట్రప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేసినట్లే ఉన్నారు. ఏపీ నుండి కేంద్రంలో కానీ జాతీయ పార్టీలో కానీ చాలామందే ప్రముఖులున్నప్పటికీ ఎవరి వల్లా ఒక్కపిసరంత ఉపయోగం కూడా రాష్ట్రానికి కనిపించటంలేదు. ఏం చేస్తాం 2024 వరకు వెయిట్ చేయకతప్పదంతే.