బండి అరెస్టుపై జోరందుకున్న వాదన

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేతను అరెస్టు చేయటం.. భారీ ఎత్తున సెక్షన్లు పెట్టేసి.. రిమాండ్ కు తరలించిన వైనం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కేలా చేస్తోంది. ఉద్యోగుల బదిలీలపై కేసీఆర్ సర్కారు విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా చేపట్టిన బండి సంజయ్ దీక్షకు అనుమతి లేదంటూ కరీంనగర్ పోలీసులు భగ్నం చేయటం.. ఆయన్ను అరెస్టు చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా బండి సంజయ్ పై నమోదు చేసిన సెక్షన్ల నేపథ్యంలో.. ఆయనకు ఏకంగా 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారింది. ఈ పరిణామంపై బీజేపీ వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని అరెస్టు చేసిన అంశంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఫైర్ అయ్యారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ శపించారు. ఇక.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జైల్లో ఉన్న బండి సంజయ్ ను పరామర్శించేందుకు కరీంనగర్ జైలుకు రానున్నారు. ఉద్యోగుల తరఫున మాట్లాడిన దానికి ఇంతలా చేస్తారా? అన్న ప్రశ్న ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. అంతేకాదు.. బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసిన వైనాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు.

తన దారిని తాను.. తమ పార్టీ కార్యాలయంలో దీక్ష చేసుకుంటే తప్పేంటి? అది కూడా కరోనా వేళ.. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసుకున్నప్పుడు అంతలా అడ్డుకోవాల్సిన అవసరం ఏమిటి? హైడ్రామాను క్రియేట్ చేయాల్సిన పనేమిటి? గేట్లు విరిచేసి.. తలుపులు బద్దలు కొట్టేసి.. ఫైరింజన్లతో భారీ ఎత్తున నీళ్లు చిమ్మి..బలవంతంగా బండి సంజయ్ ను అరెస్టు చేయాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ దీక్షకు అనుమతి లేదన్న టీఆర్ఎస్ వర్గాల వాదనకు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు కమలనాథులు. ప్రభుత్వం భారీ ఎత్తున నిర్వహించే కార్యక్రమాలతో.. సభలతో కరోనా రాదా? ముఖ్యమంత్రి.. మంత్రులు.. టీఆర్ఎస్ పార్టీ నిర్వహించే సభలు.. బైక్ ర్యాలీలతో ఎవరికీ వైరస్ సోకదా? అని ప్రశ్నిస్తున్నారు. అర్ధరాత్రి వరకు కొత్త సంవత్సరం వేడుకలకు అనుమతి ఇచ్చినప్పుడు.. బార్లు.. రెస్టారరెంట్లు.. పబ్ లు.. వైన్ షాపులకు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చినప్పుడు రాని వైరస్ విస్తరణ.. బండి సంజయ్ దీక్ష చేస్తేనే వస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు.

ఒమిక్రాన్ వేళ.. ఎగ్జిబిషన్లు.. బుక్ ఫెయిర్లు.. సినిమాలు.. పండుగల పేరుతో నిర్వహించే వేడుకలతో జరగని విస్తరణ.. బండి సంజయ్ చేసే నిరసన దీక్షతోనే విస్తరిస్తుందా? అని సూటి ప్రశ్నల్ని సంధిస్తున్నారు. బండి సంజయ్ అనే వ్యక్తి కరోనా కన్నా డేంజర్.. ఆయన దీక్షలకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయి.. ఆయన ఏమైనా సంఘ విద్రోహ శక్తా? లూటీలు.. ఖూనీలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడా? పార్టీ ఆఫీసు తలుపులు బద్దలు కొట్టి మరీ అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? కోడ్ ఉల్లంఘన చేసిన ఎంతమంది మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. అధికార పార్టీ నేతలపై కేసులు పెట్టారు? అరెస్టులు చేశారు? అని అడుగుతున్నారు. విపత్తు పేరుతో కేసులు పెట్టి జైలుకు తరలించిన వైనాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఈ ప్రశ్నల్ని సంధించటం ద్వారా బండి సంజయ్ అరెస్ట్ ఎంత దుర్మార్గమన్న భావన కలిగేలా చేస్తున్నారు కమలనాథులు. మరి..గులాబీ నేతలు దీనికేం కౌంటర్ ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.