ఎంతలా ట్రై చేసినా.. టెంప్ట్ అవ్వని బాబు


కొత్త ఏడాది అడుగు పెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని మీడియాతో మాట్లాడటం గతంలో ఒక అలవాటుగా ఉండేది. అందరూ కాకున్నా కొందరు మాత్రం ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మీడియాతో మాట్లాడటం.. మరికొన్ని సందర్భాల్లో దూరంగా ఉండటం చేసే అధినేతలు ఉన్నారు. వీరికి భిన్నంగా ఒకే విధానాన్ని ఫాలో అయ్యే కొద్ది మంది నేతల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకరు. జనవరి ఒకటి సందర్భంగా మీడియాతో కాసేపు మాట్లాడారు.

ఈ సందర్భంగా తాను చెప్పాల్సిన అంశాల్ని చంద్రబాబు చెప్పేస్తే.. అనంతరం మీడియా ప్రతినిధులు పలు అంశాల్ని ప్రస్తావిస్తూ ప్రశ్నలు వేశారు. ఇందులో భాగంగా కొన్ని ప్రశ్నలు ఆయన్ను టెంప్ట్ చేసేలా ఉన్నాయి కూడా. అయినప్పటికీ.. వాటికి తొందరపడి సమాధానం చెప్పకుండా దాట వేయటం కనిపిస్తుంది. ముందస్తు ఎన్నికల మీద ప్రచారం జరుగుతోంది కదా? అని ప్రశ్నించినప్పుడు.. తాను కూడా ఆ మాటను విన్నానని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ సిద్ధంగా ఉంటుందన్నారు. ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ ముందస్తుకు వెళతారని చెబుతున్నారని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. తాము సిద్దంగా ఉంటామని చెప్పిన ఆయన.. పనిలో పనిగా పొత్తుల గురించి ప్రస్తావించినంతనే అలర్ట్ అయ్యారు.

పొత్తుల గురించి మాట్లాడేందుకు ఇష్టపడని చంద్రబాబు.. ఊహాతీత ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వలేనని చెప్పారు. పొత్తుల కన్నా ప్రజల్లో పార్టీని బలోపేతం చేసుకోవటం ముఖ్యమన్నారు. పొత్తులతో ఒకోసారి ఓడిపోయామని.. ఒకోసారి గెలిచామని.. ఆ సందర్భంలో ఆ విషయాల గురించి ఆలోచిస్తామన్నారు. తాను చాలా కాలం సీఎంగా పని చేశానని.. కానీ వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టాన్ని తాను కూడా అంచనా వేయలేకపోతున్నట్లు చెప్పారు.

అంచనా వేయలేనంత విషాదం.. దారుణంగా రాష్ట్రాన్ని కూల్చారన్నారు. వైసీపీ పాలనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ఘోరంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. విభజన తర్వాత వేగంగా దూసుకెళ్తున్న రాష్ట్రాన్ని వీళ్లు కాళ్లు నరికేశారన్నారు. పారిశ్రామికవేత్తలు.. ఎదగాలని అనుకునేవారు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని.. చివరకు కూలి పనులు చేసుకునే వారు కూడా పక్క రాష్ట్రాలను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. మొత్తంగా ఎన్నికలు.. పొత్తు గురించి అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం టెంప్ట్ కాని చంద్రబాబు.. విషయాన్ని నెమ్మదిగా జగన్ పాలన వైపు మళ్లించి.. ఎప్పటిలానే ఘాటు విమర్శలు సంధించారు.