అమ‌రావ‌తిని చూపించి ఏపీ అప్పు..

అప్పులు చేయ‌డంలో త‌న‌కు తానే రికార్డులు బ‌ద్ద‌లు కొట్టుకుంటున్న ఏపీ ప్ర‌భుత్వం.. తాజాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేనినైతే బూచిగా చూపించి.. ప్ర‌జ‌ల‌ను తీవ్ర గంద‌ర‌గోళంలోకి  నెట్టేసిందో.. రాజ‌కీయ దుమారం రేపి.. రైతులను.. అన్ని వ‌ర్గాల వారిని ఇబ్బందిపాటు చేసిందో.. ఇప్పుడు దానినే చూపించి అప్పులు తెచ్చుకునేందుకురెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. అదే.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి. ఈ రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల పనులు చేపట్టి వాటిని హామీగా చూపించి 2022 నూత‌న సంవ‌త్స‌రంలో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పనులు చేపట్టేందుకు కూడా అవసరమైన నిధులను సమీకరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆది నుంచి మూడు రాజ‌ధానుల‌కు మొగ్గు చూపిన ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం.. గ‌త న‌వంబ‌రులో వెన‌క్కి త‌గ్గింది. అయితే.. అప్ప‌ట్లో జ‌గ‌న్ ఎందుకు వెన‌క్కి త‌గ్గార‌నే విష‌యంపై జోరుగా చ‌ర్చ సాగింది. అయితే.. తాము వెన‌క్కి త‌గ్గేది లేద‌ని.. మ‌ళ్లీ న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు తొల‌గించి.. బిల్లులు తెస్తామ‌ని.. స్వ‌యంగా సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఇక‌, శాసనసభలో మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్న అనంతరం అమరావతి ప్రాంతంలో పనులు ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీల లాంటి ప్రజాప్రతినిధులతోపాటు అఖిల భారత సర్వీసు అధికారుల కోసం 2017లో ప్రారంభించిన భవనాల సముదాయాలు దాదాపుగా పూర్తికావొచ్చాయి. ఇప్పటికే 80 శాతం నిర్మాణం పూర్తికావటంతో మిగతా పనులు చేపట్టాలని సీఆర్డీఏ భావిస్తోంది.

3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం అమరావతి మెట్రోరీజియన్ డెవలప్మెంట్ అథారిటీ స్థానంలో సీఆర్డీఏ తిరిగి అమల్లోకి వచ్చింది. దీంతో సీఆర్డీఏ ప్రాంతంలోని నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరలోనే పనులు మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే విజయవాడ- గుంటూరు పరిధిలో నివాసముంటున్న విభాగాధిపతులు, కమిషనర్లు, కార్యదర్శుల హోదాల్లోని అఖిలభారత సర్వీసు అధికారులకు 40 వేల చొప్పున అద్దె భత్యాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. విభజన అనంతరం ప్రతీ నెలా ఇది ప్రభుత్వానికి భారంగానూ మారింది.

ఇప్పటికిప్పుడు భవనాల నిర్మాణాన్ని పునః ప్రారంభించకపోయినా మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కసరత్తు చేయటంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఈ నిర్మాణాన్నిటికీ భారీ స్థాయిలోనే వ్యయం అయ్యే అవకాశముందని తెలుస్తోంది. అయితే.. ఇదంతా రాజ‌ధానిపై ప్రేమ‌తో కాద‌నేది.. ఒక వ‌ర్గం చెబుతున్న మాట‌. మౌలిక సదుపాయాల పనులు చేపట్టి వాటిని హామీగా చూపించి 2022 నూత‌న సంవ‌త్స‌రంలో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మ‌రి ఇదే నిజ‌మైతే.. మ‌రిన్ని ఇక్క‌ట్లు త‌ప్పేలా లేవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.