తమన్ లేపి అవతల పడేశాడట

తమన్ తమన్ తమన్.. ఈ మధ్య ఎక్కడ చూసినా అతడి గురించే చర్చ. తన ప్రతి సినిమాతోనూ అతను సంగీత పరంగా అతను సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. గత నెలలో విడుదలైన ‘అఖండ’ అంచనాల్ని మించిపోయి.. ప్రభంజనం సృష్టించిందంటే అందులో తమన్ సంగీతానిది కీలక పాత్ర. ముఖ్యంగా తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఆ సినిమాలో ఒక్కో సన్నివేశాన్ని అతను ఎలివేట్ చేసిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఆ సినిమా రిలీజ్ టైంలో తమన్ పేరు మార్మోగిపోయింది. బ్యాగ్రౌండ్ స్కోర్ అంటే ఇలా ఇవ్వాలి అని అందరూ తమన్‌కు ఎలివేషన్ ఇచ్చారు. ఇండస్ట్రీలో కూడా అందరూ ఇదే మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే ‘రాధేశ్యామ్’ టీం కూడా తమన్‌తో టచ్‌లోకి వచ్చింది. ఆ సినిమా హిందీ వెర్షన్‌కు ముగ్గురు సంగీత దర్శకులు పని చేస్తుంటే.. సౌత్ వెర్షన్లకు జస్టిన్ ప్రభాకరన్ పాటలు చేశాడు.

ఐతే నేపథ్య సంగీతం విషయంలో మాత్రం తమనే కరెక్ట్ అని ఫిక్సయి ఆ బాధ్యత అతడికే అప్పగించింది చిత్ర బృందం.ఐతే ‘రాధేశ్యామ్’కు తమన్ నేపథ్య సంగీతం అందిస్తాడన్న ప్రకటన వచ్చి వారమే అయింది కానీ.. అతను ఈ పని చాన్నాళ్ల ముందే మొదలుపెట్టాడట. ఈ సంగతి ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రాధాకృష్ణకుమార్ వెల్లడించాడు. తాము అనౌన్స్‌మెంట్ ఈ మధ్యే ఇచ్చినా 40-45 రోజుల ముందే అతను ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ పని మొదులపెట్టాడని రాధాకృష్ణ తెలిపాడు. తమన్ నేపథ్య సంగీతంతో ఈ సినిమాన పైకి లేపాడు అనడం కంటే కూడా లేపి అవతల పడేశాడు అనొచ్చని రాధాకృష్ణ వ్యాఖ్యానించడం విశేషం.

తమన్‌కు ఈ సినిమా ఎంత నచ్చింది అన్నది తనకు మాటల్లో చెప్పలేదని.. నేపథ్య సంగీతం విన్నాక అతనెంతగా ఈ సినిమాను ఇష్టపడ్డాడో అతనకు అర్థమైందని.. అతను ఈ సినిమాపై ఉన్న ప్రేమనంతా బ్యాగ్రౌండ్ స్కోర్లోనే చూపించాడని అన్నాడు. తమన్ లాంటి మ్యూజికల్ జీనియస్‌తో ఈ సినిమాకు వర్క్ చేయడం తనకు గర్వకారణంగా ఉందని కూడా రాధాకృష్ణ వ్యాఖ్యానించాడు. ఐతే సంక్రాంతికి అనుకున్న ‘రాధేశ్యామ్’ కరోనా కారణంగా మళ్లీ వాయిదా పడుతుండటమే అభిమానులకు రుచించడం లేదు.