ఉండ‌వ‌ల్లికి ఇప్పుడు తెలిసొచ్చిందా?

వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యేల్లో  అత్యంత వివాదాస్ప‌ద నాయ‌కురాలిగా పేరొందిన గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి.. అన్ని వ‌ర్గాల నుంచి గ‌ట్టి షాకే త‌గులుతోంది. ఇటీవ‌ల ఆమె అంబేడ్క‌ర్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆమె సామాజిక వ‌ర్గం నుంచే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. దీంతో ఇప్పుడు నాలిక క‌రుచుకుని.. “త‌ప్పు నాది కాదు“ అని మ‌రోసారి విరుచుకుప‌డ్డారు.

ఏం జ‌రిగిందంటే..
ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ 4వ మాదిగ మహాసభలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ..”రాజ్యంగం రచించిన అంబేడ్కర్ అందరికి తెలుసు. కానీ రాజ్యంగం పార్లమెంట్లో అమలయ్యేందుకు బాబు జగ్జీవన్రాం కృషి చేశారు. స్వాతంత్య్ర సమరంలో ఆయన పోరాటం చేశారు. మనం బాబు జగ్జీవన్రాంను ఆదర్శంగా తీసుకోవాలి.” అని వ్యాఖ్యనించారు. ఈ వ్యాఖ్యలు శ్రీదేవికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

ఇప్పుడేమ‌న్నారంటే..
అంబేడ్కర్ను తాను అవమానపరచేలా మాట్లాడలేదని.. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని  ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఇటీవల ప్రపంచ 4వ మాదిగ మహాసభలో తాను చేసిన ప్రసంగాన్ని ఎడిటింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తన ప్రసంగంలో తెలియక తప్పులు దొర్లి ఉంటే అంబేడ్కర్ వాదులు, దళిత బహుజనులు క్షమించాలని కోరారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా అంబేడ్కర్పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు.

అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొలి నాళ్లలో కొంత మంది కులవాదులు వ్యతిరేకించినప్పటికీ.. ఆయనతో పాటు రాజ్యాంగ కమిటీ సభ్యుడిగా పని చేసిన బాబు జగ్జీవన్రాం పార్లమెంటులో రాజ్యాంగ ప్రతి ఫలాలలను కింది స్థాయికి చేర్చేందుకు బలియంగా కృషి చేశారని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. అంబేడ్కర్ మరణానంతరం రాజ్యాంగ పరిరక్షణకు బాబు జగ్జీవన్రాం వేసిన బాటలు.. సత్ఫలితాలు ఇచ్చాయన్న భావాన్ని మాదిగ మహాసభలో ప్రస్తావించానన్నారు.

ఎవర్ని వదిలిపెట్ట‌ద‌ట‌!
కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందేందుకు కొంతమంది కావాలనే దుష్ప్రచారానికి పూనుకున్నారని శ్రీదేవి మండిపడ్డారు. లేనిపోని ఆరోపణలతో తనపై విష ప్రచారం చేస్తూ.. తాను మాట్లాడిన వీడియోని ఎడిటింగ్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.