రఘురామకృష్ణరాజు పై సీబీఐ కోర్టులో చార్జిషీట్..

2021 చివరి రోజున నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నిత్యం తమ పార్టీకే చెందిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు.. ఆరోపణలు చేసే ఆయనే తప్పు చేశారని.. రూ.947 కోట్ల ఆర్థిక మోసానికి పాల్పడినట్లుగా సీబీఐ కోర్టులో చార్జిషీట్ దాఖలు కావటం సంచలనంగా మారింది. ఆర్థిక సంస్థలు.. బ్యాంకులను మోసం చేశారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ.

తమిళనాడులోని ట్యూటీకొరిన్ లో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి భారీ ఎత్తున రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన ఆరోపణ ఆయనపై రావటం ఒక ఎత్తు అయితే 2019 ఏప్రిల్ 29న సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా చార్జిషీట్ దాఖలైంది. ఇంతకూ సీబీఐ చార్జిషీట్ లో దాఖలైన అంశాలు ఏమిటన్నది చూస్తే..

  • ఇండ్‌ భారత్‌ పవర్‌ కంపెనీ చైర్మన్, ఎండీగా రఘురామకృష్ణరాజు వ్యవహరిస్తున్నారు. తమిళనాడులోని ట్యూటికోరిన్‌లో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆర్థిక సంస్థల కన్సార్షియం నుంచి రూ.947.71 కోట్లు రుణం తీసుకున్నారు. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ లతో కూడిన కన్సార్షియం రుణం మంజూరు చేసింది.
  • ఇంత భారీగా రుణాన్ని తీసుకున్నప్పటికీ రఘురామ కంపెనీ మాత్రం తమిళనాడులో థర్మల్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయలేదు. రుణ ఒప్పంద నిబంధనల్ని పాటించలేదు. రుణం తీసుకున్న తర్వాత నిధుల్ని నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారు.
  • ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న నిధులను కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌లు చెల్లించేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూకో బ్యాంకులలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. అనంతరం ఆ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను హామీగా చూపించి ఆ రెండు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. వాటితో కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించినట్టుగా చూపారు. ఆ రెండు బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించనే లేదు.
  • ఈ నేపథ్యంలో తాము ఇచ్చిన రుణానికి సంబంధించిన మొత్తాన్ని తమ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్ల మొత్తాన్ని జమ చేసుకున్నాయి బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యూకో బ్యాంకులు.
  • ఈ మొత్తం ఎపిసోడ్ లో పవర్ ప్లాంట్ కోసం రుణాన్ని ఇచ్చిన ఆర్థిక సంస్థల కన్సార్షియం పులుసులో ములక్కాయగా మారింది. పూర్తిగా మోసపోయింది. ఇలా.. ఆర్థిక సంస్థల నుంచి పవర్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.947.71 కోట్ల రుణాన్ని తీసుకొని.. పవర్ ప్లాంట్ పెట్టకపోగా.. నిధుల్ని పక్కదారి పట్టించినట్లుగా సీబీఐ గుర్తించింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ ను తాజాగా దాఖలు చేసింది.
  • సీబీఐ చార్జిషీట్ లో ఎంపీ రఘురామ రాజుతో పాటు మిగిలిన నిందితులు ఎవరన్నది చూస్తే.. పెద్ద ఎత్తున కంపెనీలు కనిపిస్తాయి. వాటిల్లో దాదాపు ఏడు కంపెనీల పేర్ల ముందు ‘ఇండ్ భారత్’తో మొదలై.. ఏదో ఒక తోక పేరు కనిపించటం గమనార్హం.

వారు ఎవరెవరంటే..

  • ఇండ్‌ భారత్‌ పవర్‌ మద్రాస్‌ లిమిటెడ్‌ కంపెనీ,కె.రఘురామకృష్ణరాజు, చైర్మన్, ఎండీ, ఇండ్‌
  • భారత్‌ పవర్‌ మద్రాస్‌ లిమిటెడ్‌ కంపెనీ మధుసూదన్‌రెడ్డి, డైరెక్టర్, ఇండ్‌ భారత్‌ పవర్‌
  • మద్రాస్‌ లిమిటెడ్‌ కంపెనీ
  • ఇండ్‌ భారత్‌ పవర్‌ ఇన్ఫ్రా లిమిటెడ్‌
  • ఆర్కే ఎనర్జీ లిమిటెడ్‌
  • శ్రీబా సీబేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
  • ఇండ్‌ భారత్‌ పవర్‌ జెన్‌కామ్‌ లిమిటెడ్‌
  • ఇండ్‌ భారత్‌ ఎనర్జీ ఉత్కళ్‌ లిమిటెడ్‌
  • ఇండ్‌ భారత్‌ పవర్‌ కమాడిటీస్‌ లిమిటెడ్‌
  • ఇండ్‌ భారత్‌ ఎనర్జీస్‌ మహారాష్ట్ర లిమిటెడ్‌
  • ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌
  • సోకేయి పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
  • వై.నాగార్జున రావు, ఎండీ, సోకేయి పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
  • ఎం.శ్రీనివాసుల రెడ్డి, చార్టెడ్‌ అకౌంటెంట్‌
  • ప్రవీణ్‌ కుమార్‌ జబద్, చార్టెడ్‌ అకౌంటెంట్‌
  • సి.వేణు, ఇండ్‌ భారత్‌ గ్రూప్స్‌ చార్టెడ్‌ అకౌంటెంట్‌