పారితోషకం కట్ చేసుకుంటా.. ఓటీటీ వద్దు ప్లీజ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈ రోజు హిందీ సినిమా ‘జెర్సీ’ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కావాల్సింది. కానీ విడుదలకు కేవలం నాలుగు రోజుల ముందు ఈ చిత్రానికి బ్రేక్ పడింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీలో థియేటర్లు మూత పడటం.. ఉత్తరాదిన మరికొన్ని రాష్ట్రాల్లో థియేటర్లపై ఆంక్షలు పెట్టే సూచనలు కనిపిస్తుండటంతో ఈ చిత్రాన్ని హఠాత్తుగా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

తర్వాత ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదు. కరోనా తీవ్రత ఇంకా పెరిగేలా ఉందే తప్ప తగ్గేలా లేదు. ఈ నేపథ్యంలో ‘జెర్సీ’ పరిస్థితి అగమ్య గోచరంగా మారేలా ఉంది. ఇప్పటికే సినిమా వాయిదాల మీద వాయిదా పడి చాలా ఆలస్యం అయింది. దీంతో ‘జెర్సీ’ని ఓటీటీలో రిలీజ్ చేయడంపై నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ, అమన్ గిల్ సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఈ అనిశ్చితి ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు కాబట్టి ఓటీటీకి వెళ్లడమే ఉత్తమం అనుకుంటున్నారట.ఐతే హీరో షాహిద్ కపూర్ మాత్రం ‘జెర్సీ’ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ససేమిరా అంటున్నాడట. ‘జెర్సీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుందని అతను బలంగా నమ్ముతున్నాడు. ఇంతకుముందు అతను ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ చేయగా.. ఆ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. షాహిద్ ఇమేజ్, మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అతణ్ని నెక్స్ట్ లీగ్‌లోకి తీసుకెళ్లింది.

‘జెర్సీ’ సినిమా తనను ఇంకో మెట్టు ఎక్కిస్తుందని, ఇంకా పెద్ద స్టార్‌ను చేస్తుందని.. థియేటర్లలోనే చూడాల్సిన సినిమా ఇదని అతను భావిస్తున్నాడు. అందుకే తాను పారితోషకంగా తీసుకున్న రూ.31 కోట్ల నుంచి ఐదు కోట్లో, పది కోట్లో.. ఎంత కావాలంటే అంత కోత వేసుకోవడానికి సిద్ధమని, కానీ ఈ చిత్రాన్ని ఓటీటీలో మాత్రం రిలీజ్ చేయొద్దని.. కొన్నాళ్లు హోల్డ్ చేసి థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్మాతలను అతను గట్టిగా కోరుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి దిల్ రాజు అండ్ కో ఇందుకు ఒప్పుకుంటారో లేదో చూడాలి.