కాపులకు రాజ్యాధికారం ఇలా సాధ్యమేనా?

రాజ్యాధికారాన్ని సాధించాలన్నది కాపు సామాజికవర్గంలోని ప్రముఖల చిరకాల కోరిక. దీనికోసం ఇప్పటికి కొన్ని వందల సమావేశాలు పెట్టుకునుంటారు. వివిధ సమావేశాల్లో తీర్మానాలు కూడా చేశారు. అయినా రాజ్యాధికారం దిశగా ఒక్కఅడుగు కూడా ముందుకుపడలేదు. దీనికి కారణం ఏమిటి ? కారణాలను అన్వేషించే ముందు తాజగా జరిగిన మరో సమావశం గురించి మాట్లాడుకుందాం. హైదారబాద్ లోని ఓ హోటల్లో సామాజికవర్గానికి చెందిన కొందరు ప్రముఖులు సమావేశమయ్యారు.

ఇంతకీ పాల్గొన్న ప్రముఖులెవరంటే కన్నా లక్ష్మీనారాయణ, గంటా శ్రీనివాసరావు, వంగవీటి రాధాకృష్ణ, తోట చంద్రశేఖర్, తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరి రామ్మోహన్ రావు, కాపు రిజర్వేషన్ పోరాటసమితి కన్వీనర్ ఆరేటి ప్రకాశరావు, సంఘం నేతలు కేవీరావు, ఎంహెచ్ రావు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా చేరిన ఆశ్చర్యకరమైన పేరు జేడీ లక్ష్మీనారాయణ. గతంలో అధికారాన్ని అందుకునేందుకు చిరంజీవి, పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలు,  విఫలమైన తీరును సమావేశం గుర్తుచేసుకుంది. కాబట్టి అలా కాకుండా గట్టిగా ముందుకెళ్ళాలని డిసైడ్ అయ్యింది.

విచిత్రమేమిటంటే కాపునేతల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నా అంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని నిర్ణయించుకోవటం. కాపునేతలు ఇఫుడు తాముంటున్న పార్టీల్లోనే ఎవరికి వాళ్ళు కొనసాగేట్లయితే ఇక కాపులకు రాజ్యాధికారం ఎలా సాధ్యం ? వివిధ పార్టీల్లోని కాపునేతలు, ప్రముఖులంతా తమ పార్టీలకు రాజీనామాలు చేసి కాపు బ్యానర్ కిందకు వచ్చి పోటీచేస్తేనే కాపులకు రాజ్యాధికారం సాధ్యమవుతుంది. ఉదాహరణకు వివిధ పార్టీల్లో మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, సీనియర్ నేతలున్నారని అనుకుందాం.

వారికి నిజంగానే కాపులకు రాజ్యాధికారం కావాలనే పట్టుదలుంటే వారంతా ముందు తమ పార్టీలకు, పదవులకు రాజీనామాలు చేయాలి. కాపుల కోసం కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో చేరాలి. రాబోయే ఎన్నికల్లో వాళ్ళంతా కేవలం కాపు పార్టీ తరపునే పోటీచేసి గెలిస్తే అప్పుడే కాపులకు రాజ్యాధికారం వస్తుంది. అంతేకానీ కాపుల్లో ఎవరున్న పార్టీల్లోనే వాళ్ళు కంటిన్యు అవుతు రాజ్యాధికారం రావాలంటే ఎప్పటికీ రాదు.

కాపులకు రాజ్యాధికారం అంటే రాష్ట్రాన్ని కాపులే పరిపాలించటం. అందుకు పదవులు అనుభవిస్తున్న కాపు ప్రముఖులు త్యాగాలకు సిద్ధంకావాలి. తమ పదవులను, పార్టీలను వదులుకుని కాపు బ్యానర్ కిందకు వచ్చేయాలి. అది సాధ్యమేనా ? జరగాల్సింది జరగనంతవరకు కాపులకు రాజ్యాధికారం మిధ్యగానే మిగిలిపోతుంది. ఇలాంటి సమావేశాలు ఎన్ని పెట్టుకున్నా ఉపయోగంలేదని కాపు ప్రముఖులు గ్రహించాలి.