మందు బాబుల కోసం స్పెషల్ బస్సులు

ఏడాది మొత్తంలో అత్యధికంగా పార్టీలు జరిగే రోజు ఏది అంటే మరో మాట లేకుండా డిసెంబరు 31 అని చెప్పేయొచ్చు. ఆ రోజు ప్రపంచం మొత్తం పార్టీ మూడ్‌లో ఉంటుంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే క్రమంలో జనాలంతా పార్టీల్లో మునిగి తేలుతారు. మేజర్ సిటీస్‌లో ఎలా మద్యం ఏరులై పారుతుందో తెలిసిందే. ఐతే ఇలా పార్టీల్లో పూటుగా తాగి.. వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లు చేయడం.. తమతో పాటు వేరే వాళ్ల ప్రాణాల మీదికి తేవడం మామూలే.

ఇలా మందుకొట్టి వాహనాలు నడిపే వారి కోసమే పోలీసులు సిటీల్లో ఎక్కడిక్కడ కాపు కాసి ఉంటారు. గ్రూప్‌లో మందుకొట్టని వ్యక్తి ఉండి తాగిన వాళ్లందరినీ తీసుకెళ్లి వారి వారి ఇళ్ల దగ్గర దింపితే ఓకే కానీ.. లేదంటే చాలా సమస్యలే తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ ఒక వినూత్న ఆలోచన చేసింది. హైదరాబాద్ సిటీలో 31న లేట్ నైట్ నుంచి తెల్లవారుజాము వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. ఐతే ఇది ఆర్టీసీ అధికారులు సొంతంగా చేసిన ఆలోచన కాదు.

ఒక నెటిజన్ పెట్టిన ప్రపోజల్ మీద వెంటనే ఆర్టీసీ కమిషనర్ సజ్జనార్ స్పందించి ఈ మేరకు ఏర్పాట్లు చేయించడం విశేషం. 31న రాత్రి మందుబాబులు వాహనాలు నడపడంతో చాలా ఇబ్బందులు తలెత్తుతాయని.. కాబట్టి వారి కోసం ప్రతి రూట్లోనూ స్పెషల్ బస్సులు నడపాలని, లేట్ నైట్ వారిని క్షేమంగా వాళ్ల ఇళ్ల దగ్గర దింపినందుకు కాస్త ఎక్కువగానే డబ్బులు వసూలు చేయొచ్చని, ఇలా చేస్తే వారి కుటుంబ సభ్యులు అదనంగా కూడా డబ్బులిస్తారని ఒక నెటిజన్ ట్వీట్ వేశాడు.

దీనికి సజ్జనార్ స్పందించి, ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. కొన్ని గంటల్లోనే ఈ స్పెషల్ సర్వీసుల గురించి ఆర్టీసీ నుంచి అధికారిక ప్రకటనా వచ్చింది. సిటీలో ఎక్కడెక్కి ఎక్కడ దిగినా రూ.100 టికెట్ ధరతో ఈ బస్సులను శుక్రవారం లేట్ నైట్ నుంచి తెల్లవారుజాము వరకు నడపబోతున్నారు. ఇవి పక్కాగా మందు బాబుల కోసం పెట్టిన సర్వీసులని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.