నోరు జారి.. ఇచ్చిన హామీ.. సోముకు ప‌ద‌వీ గండం!

Somu Veeraju

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు ఆచితూచి అడుగులు వేయాలి. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. ప‌రిస్థితి చేయి దాటి పోవ‌డం ఖాయం. బీజేపీ రాష్ట్ర చీఫ్‌.. ఆర్ ఎస్ ఎస్ వాది సోము వీర్రాజు చేసిన‌ ఒకే ఒక్క కామెంట్‌.. సంప్ర‌దాయ బీజేపీ వాదుల‌ను పార్టీకి దూరం చేసే ప్ర‌మాదాన్ని తీసుకువ‌చ్చింది. అంతేకాదు.. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వ‌ర‌కు మీడియా ఇప్పుడు ఆయ‌న‌ను ఏకేస్తోంది.

దీంతో సోము వ్యాఖ్య‌ల‌పై జాతీయ పార్టీ నేత‌లు దృష్టి పెట్టారు. విజ‌య‌వాడ వేదిక‌గా.. బీజేపీ నాయ‌కులు తాజాగా ప్ర‌జాగ్ర‌హ స‌భ‌ను నిర్వ‌హించారు. ఈ స‌భ‌కు ఢిల్లీ నుంచిరాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా నాయ‌కులు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో సోము.. ఆవేశానికి గుర‌య్యారు. ఆవేద‌న‌కు కూడా లోన‌య్యారు. ఇవ్వ‌కూడ‌ని హామీని ప్ర‌స్తావించారు. తాము అధికారంలోకి వ‌స్తే.. చీప్ లిక్క‌ర్‌ను రూ.70 కే ఇస్తామ‌ని.. అంతేకాదు.. ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డ్డాక చీప్ లిక్క‌ర్‌ను రూ.50కే ఇచ్చేలా నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అన్నారు.

ఈ ఒక్క వ్యాఖ్యే ఇప్పుడు కోట్ల మంది ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌స్తోంది. బీజేపీని అధికారంలోకి తీసుకువ‌స్తే.. త‌మ కుటుంబాలు నాశ‌నం అయిపోవ‌డం ఖాయ‌మ‌ని పేద‌లు అంటుంటే.. అంత పెద్ద బీజేపీ ఎలాంటి అంశాలూ లేవ‌న్న‌ట్టుగా.. చీప్ లిక్క‌ర్ హామీ ఇచ్చి.. చీప్ పాలిటిక్స్ చేస్తోందా? అని జాతీయ మీడియా నిప్పులు చెరిగింది.
ప‌లువురు జాతీయ స్థాయి ప్ర‌ముఖులు కూడా సోమును టార్గెట్ చేశారు. వాస్త‌వానికి బీజేపీ లిక్క‌ర్ వ్య‌తిరేక పార్టీ. కానీ, సోము మాత్రం ఏ మూడ్‌లో ఉన్నారో.. అనూహ్యంగా ఆయ‌న నోటి నుంచి ఈ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీపై ఆశ‌లు పెట్టుకున్న‌వారు కూడా ఇంకేముంది.. బీజేపీ వ‌స్తే.. చీప్ లిక్క‌ర్ ఇస్తార‌న్న మాట‌.. హోదా పోయింది.. పోల‌వ‌రం పోయింది.. రాజ‌ధాని పోయింది.. చివ‌ర‌కు మ‌న‌కు లిక్క‌రే మిగులుతుంద‌ని తేల్చారా? అని పెద‌వి విరుస్తున్నారు. సోము వ్యాఖ్య‌లు పార్టీకి మ‌రింత చేటు చేశాయ‌ని బీజేపీ నాయ‌కులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్ర‌మంలో.. ఆయ‌న‌ను మారుస్తార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.