ఆ సినిమాను సుక్కు వదిలేసినట్లేనా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల మీద ఎప్పట్నుంచో ఒక కంప్లైంట్ ఉంది. వాళ్ల చూపు ఎప్పుడూ పెద్ద స్టార్ల మీదే ఉంటుందని.. మిడ్ రేంజ్, అప్ కమింగ్ హీరోలతో సినిమాలు చేయడానికి వాళ్లు అంతగా ఆసక్తి చూపించరనేది ఫిర్యాదు. దాదాపుగా టాలీవడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ ఇదే వరుస. ఎదిగే క్రమంలో చిన్న, మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసి ఒక స్థాయి అందుకున్నాక బడా స్టార్లతోనే వరుసగా జట్టు కడుతుంటారు.

వాళ్ల కెరీర్లలో కాస్త డౌన్ అయినపుడు మాత్రమే చిన్న, మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు. సుకుమార్ సైతం చాలా ఏళ్ల నుంచి టాప్ స్టార్లతోనే సినిమాలు చేస్తున్నాడు. వరుసగా మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో అతను సినిమాలు చేశాడు. ఇప్పుడు ‘పుష్ప’కు కొనసాగింపుగా సెకండ్ పార్ట్ తీయడానికి రెడీ అవుతున్నాడు.

ఆ తర్వాత ఆయనకున్న కమిట్మెంట్ ప్రకారం అయితే విజయ్ దేవరకొండతో సినిమా చేయాలి.సుక్కు-విజయ్ కాంబినేషన్లో ఏడాది కిందటే ఒక సినిమా అనౌన్స్ చేయడం గుర్తుండే ఉంటుంది. అల్లు అర్జున్ మిత్రుడైన కేదార్ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కావాల్సింది. ఐతే ఈ సినిమా ప్రకటనలకే పరిమితం అవుతుందేమో అన్న సందేహాలు ముందు నుంచి వస్తూనే ఉన్నాయి. అనౌన్స్‌మెంట్ తర్వాత సినిమా గురించి ఏ అప్‌డేట్ లేదు. ఇప్పుడు ఆ సందేహాలు మరింతగా పెరిగిపోతున్నాయి తాజా పరిణామాలు చూస్తుంటే. ‘పుష్ప-2’ తర్వాత సుకుమార్.. రామ్ చరణ్‌తో సినిమా చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది.

ఈ సినిమా గురించి రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. వచ్చే ఏడాది చివర్లో లేదా 2023 ఆరంభంలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు. అనౌన్స్‌మెంట్ వచ్చిన రెండు మూడేళ్లకు కూడా సినిమా పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. పైగా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఈ సినిమా ఊసే ఎత్తట్లేదు. అప్‌డేట్లేమీ ఇవ్వట్లేదు. దీన్ని బట్టి ఈ సినిమా ఆగిపోయిందనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారందరూ.