సుధీర్ బాబు సినిమాకు బిగ్ బూస్ట్

కెరీర్లో కొన్నేళ్ల పాటు మహేష్ బాబు బావ అన్న గుర్తింపుతోనే బండి నడిపించాడు సుధీర్ బాబు. ఐతే ఈ ట్యాగ్‌తో ఎంతో కాలం మనుగడ సాధించడం కష్టం. నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటే, హీరోగా ఇమేజ్ పెంచుకుంటేనే ముందడుగు పడుతుంది. ఈ విషయాన్ని గుర్తించే సుధీర్ కష్టపడ్డాడు. నటుడిగా మెరుగయ్యాడు. డైలాగ్ డెలివరీని మెరుగుపరుచుకున్నాడు. చాలామంది స్టార్లకు కూడా సాధ్యం కాని రీతిలో ఫిజిక్‌కు అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాడు.

మంచి పాత్రలు పడ్డపుడు ఎంతో శ్రద్ధ పెట్టి వాటిని పండించాడు. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే చిత్రాలతో తన పట్ల ప్రేక్షకుల అభిప్రాయాల్నే మార్చేశాడు సుధీర్. ఈ చిత్రాలతో అతడికి ప్రేక్షకుల్లో ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది. తన సినిమాలపై గురి పెరిగింది. ఐతే ఇలా కొంత పేరు సంపాదించాక సుధీర్‌కు వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. వీర భోగ వసంత రాయలు, వి, శ్రీదేవి సోడా సెంటర్ అతణ్ని నిరాశకు గురి చేశాయి.

ఇప్పుడు సుధీర్ ఆశలన్నీ తనకు ‘సమ్మోహనం’ లాంటి మరపురాని చిత్రాన్నందించిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా ప్రోమోలు చూస్తే ఇంద్రగంటి మళ్లీ తన మార్కు మాయాజాలం చేయబోతున్నట్లు అనిపిస్తోంది. ఫీల్ గుడ్ వైబ్స్ కనిపిస్తున్నాయిందులో. సుధీర్‌కు మరో ‘సమ్మోహనం’ అవుతుందన్న భావన కలుగుతోంది. ‘ఉప్పెన’ భామ కృతి శెట్టి ఇందులో కథానాయికగా నటించింది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ త్వరలోనే విడుదలకు ముస్తాబవుతోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ అనే కొత్త సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఇప్పుడు పెద్ద సపోర్ట్ లభించింది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను టేకప్ చేసింది. హోల్‌సేల్‌గా సినిమాను కొనేసి తమ బేనర్ మీద రిలీజ్ చేయబోతోంది. ఈ సినిమాకు ఇది కచ్చితంగా పెద్ద బూస్టే. ఈ డీల్‌తో రిలీజ్‌కు ముందే సక్సెస్ కొట్టేసిన ఫీలింగ్‌లో ఉంది చిత్ర బృందం. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారట.