చెరోవైపు KCRను వాయించేస్తున్నారుగా ?

కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇద్దరికి ఇద్దరే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక ఆందోళన పేరుతో  చెరో వైపు కేసీయార్ కు ఊపిరి ఆడకుండా చేసేస్తున్నారు. ఇద్దరు సోమవారం ఒకేసారి వేర్వేరు అంశాలపై ఆందోళనలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమం పేరుతో రేవంత్ ఎర్రవెల్లిలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. అయితే జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంట్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులకు, రేవంత్+ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వివాదంతో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు టెన్షన్ గా తయారైంది.  ఎర్రవెల్లిలోని కేసీయార్ ఫాంహౌస్ లో వరి సాగు విషయాన్ని జనాలకు చూపేందుకు రేవంత్ ప్రయత్నించటంతోనే వివాదం మొదలైంది. కొద్దిరోజులుగా తెలంగాణ-కేంద్ర ప్రభుత్వాల మధ్య వరి రాజకీయంగా బాగా రాజుకుంటున్న విషయం తెలిసిందే. కేంద్రానికి వ్యతిరేకంగా కేసీయార్ రాజకీయం మొదలుపెడితే కేసీయార్ కు వ్యతిరేకంగా రేవంత్ మొదలుపెట్టారు. 
ఇక బండి విషయం చూస్తే తెలంగాణలో నిరుద్యోగ దీక్ష చేశారు. ఇందిరాపార్కు దగ్గర నిరుద్యోగులతో కలిసి బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీక్ష చేయాలని బండి ప్లాన్ చేశారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో బీజేపీ ఆఫీసులోనే పార్టీలోని ప్రముఖుల సమక్షంలో బండి దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్షకు నిరుద్యోగులు, విద్యా వాలంటీర్లు మద్దతు ప్రకటించారు. పార్టీ ఆఫీసులో చేసిన దీక్షకు కూడా వివిధ వర్గాల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. 

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇద్దరు కూడా తెలంగాణాలో బర్నింగ్ ప్రాబ్లెమ్స్ నే టేకప్ చేశారు. రేవంత్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పార్టీలో మంచి కదలికే తెచ్చారు. అంతకు ముందు స్తబ్దుగా ఉండే చాలామంది నేతల్లో చురుకుపుట్టింది. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లో మంచి జోష్ కనిపిస్తోంది. మొత్తానికి రేవంత్ అయినా బండి అయినా ఏదో ప్రాబ్లెమ్ తీసుకోవటం కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనని, నిరసనని గోల గోల చేస్తున్నారు. దీంతో వీళ్ళకు సమాధానం చెప్పుకోలేక మంత్రులు నానా అవస్థలు పడుతున్నారు.