డ్రగ్స్ కేసులో బెదిరింపులు.. నటి ఆత్మహత్య!

కొందరు వ్యక్తులు డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించడంతో యువనటి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫేక్ ఎన్‌సీబీ అధికారుల రైడింగ్ తో కలత చెందిన నటి ముంబైలో సూసైడ్ చేసుకొని మరణించింది. వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 20న తన స్నేహితులతో కలిసి హుక్కా పార్లర్ కు వెళ్లింది ముంబైకి చెందిన యువనటి. అప్పుడు అక్కడకు ఇద్దరు వ్యక్తులు ఎన్‌సీబీ అధికారులమంటూ వచ్చి రైడ్ చేశారు. 

ఈ క్రమంలో సదరు నటిని డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. అలా చేయకుండా ఉండాలంటే.. రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె అతికష్టం మీద రూ.20 లక్షలు అడ్జస్ట్ చేసి వాళ్లకు ఇచ్చింది. అయినప్పటికీ వారు మరింత డబ్బు కావాలని వేధింపులకు గురి చేశారు. దీంతో భయపడిన ఆమె డిసెంబర్ 23న తన అపార్ట్మెంట్ లో సూసైడ్ చేసుకొని చనిపోయింది. 

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో వారికి కొన్ని విషయాలు తెలిశాయి. రైడ్ చేసింది ఫేక్ ఎన్‌సీబీ అధికారులని పోలీసులు గుర్తించారు. ఎన్‌సీబీ అధికారులమని చెప్పుకున్న నిందితులు సూరజ్ పర్దేశి, ప్రవీణ్ వాలింబేను అరెస్ట్ చేశారు. అయితే సదరు నటి దగ్గర డబ్బులు నొక్కడానికి ఆమె స్నేహితులే పార్టీకి తీసుకెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఈ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఎన్‌సీబీ సంస్థపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్‌సీబీ అధికారులు ప్రయివేట్ ఆర్మీను సృష్టించి సెలబ్రిటీలను కావాలనే వేధిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు నటి ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు వ్యక్తులతో ఎన్‌సీబీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.