జ‌గ‌న్ ఇగో కొంప ముంచుతోందా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రే స‌మ‌స్యా లేన‌ట్లు సినిమా టికెట్ల వ్య‌వహారాన్ని నెత్తికెత్తుకుంది అక్క‌డి ప్ర‌భుత్వం. ఇటు మంత్రుల‌, అటు అధికార యంత్రాంగం ఈ వ్య‌వ‌హారంపై పెడుతున్న శ్ర‌ద్ధ చూసి అంద‌రూ ముక్కున వేలేసుకుంటున్నారు. బొత్స స‌త్య‌నారాయ‌ణ లాంటి సీనియ‌ర్ మంత్రి కూడా ఈ విష‌యం మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. అస‌లు ఏమ‌నుకుని ఈ వ్య‌వహారంలో ప్ర‌భుత్వం వేలు పెట్టిందో కానీ.. ఇప్పుడ‌ది ప్ర‌భుత్వం మెడ‌కు చుట్టుకునేలా క‌నిపిస్తోంది.

ముందుగా ఏప్రిల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా వ‌కీల్ సాబ్ రిలీజ్ సంద‌ర్భంగా ఈ ఇష్యూ మొద‌లైంది. సీఎం జ‌గ‌న్ ప్ర‌ధాన‌ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్లో ఒక‌రైన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఇబ్బంది పెట్ట‌డానికే అప్పుడు టికెట్ల రేట్ల మీద నియంత్ర‌ణ తెచ్చార‌న్న‌ది స్ప‌ష్టం. ఆ త‌ర్వాత క‌రోనా బ్రేక్ వ‌చ్చింది. అంద‌రూ ఈ విష‌యాన్ని మ‌రిచిపోయారు. ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని అక్క‌డితో వ‌దిలేయాల్సింది. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త సినిమా భీమ్లా నాయ‌క్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంద‌న్న ఉద్దేశంతో చేశారో, సినిమా వాళ్లు జ‌గ‌న్‌కు ఇవ్వాల్సినంత గౌర‌వం ఇవ్వ‌లేద‌ని చేశారో, ఇంకేం ఉద్దేశాలున్నాయో కానీ.. ఈ విషయంలో ప్ర‌భుత్వ తీరు జ‌నాల‌కు తీవ్ర‌ అస‌హ‌నం క‌లిగించే ప‌రిస్థితి వ‌చ్చింది.

పైగా ఈ ఇష్యూ ఇప్పుడు జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఆసియాలోనే అతి పెద్ద స్క్రీన్ ఉన్న వి ఎపిక్ థియేట‌ర్ మూత ప‌డ‌టంతో ప‌రిస్థితి తీవ్ర‌త అంద‌రికీ తెలిసింది. ఏపీలో టికెట్ల రేట్ల అంశంపై ఇత‌ర రాష్ట్రాల పీఆర్వోలు, మీడియా వాళ్లు స్పందిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ అంశం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. జ‌నం మంచి కోస‌మే ఇలా చేస్తున్నాం, వాళ్ల కోస‌మే టికెట్ల ధ‌ర‌లు త‌గ్గిస్తున్నాం అన్న వాద‌న ఏమాత్రం నిల‌వ‌డం లేదు. ఈ క్ర‌మంలో మిగ‌తా ప్రభుత్వ వైఫ‌ల్యాల‌న్నీ తెర‌పైకి వ‌స్తున్నాయి.

మ‌రి నిత్యావ‌స‌ర ధ‌ర‌ల మాటేంటి.. పెట్రోలుపై ఆ ప‌న్నులేంటి.. సంక్రాంతికి బ‌స్సు టికెట్ల రేట్లు 50 శాతానికి పెంచ‌డ‌మేంటి అంటూ జ‌నాలు లాజిక్స్ తీస్తున్నారు. ఇవే ప్ర‌శ్న‌ల‌తో తీవ్ర స్థాయిలో ప్ర‌భుత్వంపై ఎదురు దాడి చేస్తున్నారు. సామాన్యులు ఇబ్బంది ప‌డ‌కుండా సాక్షి ప‌త్రికను 2 రూపాయ‌ల‌కే ఇవ్వండి.. భార‌తీ సిమెంటు బ‌స్తా 150కే ఇప్పించండి.. అంటూ అధికార పార్టీ నేత‌ల‌కు చురుక్కుమ‌నిపించేలా కౌంట‌ర్లు వేస్తూ సోష‌ల్ మీడియాలో ఉతికారేస్తున్నారు నెటిజ‌న్లు. మేం అడిగే స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించ‌కుండా.. ఎవ్వ‌రూ అడ‌గ‌ని టికెట్ల రేట్ల నియంత్ర‌ణ ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇవేమీ ప్ర‌తిప‌క్ష పార్టీల ప్రాయోజితం కాదు. నెటిజ‌న్లు స్వ‌చ్ఛందంగానే ప్ర‌భుత్వం మీద విరుచుకుప‌డుతున్నారు. మొత్తానికి టికెట్ల వ్య‌వ‌హారంలో జోక్యం ఉద్దేశం ఏదైన‌ప్ప‌టికీ.. ఈ ఇష్యూ ఇప్పుడు మెడ‌కు చుట్టుకుని బ‌ద్నాం అయ్యే ప‌రిస్థితిలో ప‌డింది జ‌గ‌న్ స‌ర్కారు.