బీసీలపై బాబు ఫోకస్

దూరమైన బీసీలను మళ్ళీ దగ్గరకు చేర్చుకునేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బీసీలంతా టీడీపీతోనే ఉన్నారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అనేంతగా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అంతటి ముద్ర వేసేశారు. అలాంటిది 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు వ్యవహార శైలి కారణంగా బీసీల్లో చీలికొచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు తమ సంఘాల నేతలతో చంద్రబాబు వ్యవహరించిన తీరుతో మండిపోయిన బీసీలకు ఒళ్ళుమండిపోయింది.

చంద్రబాబు మీద కోపాన్ని బీసీలు 2019 ఎన్నికల్లో చూపించారు. బీసీల్లోని బలమైన వర్గం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవటం వల్లే వైసీపీకి 151 సీట్ల బంపర్ మెజారిటీ వచ్చింది. దీనికితోడు తర్వాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా బీసీలు వైసీపీకే ఓట్లేశారు. దాంతో టీడీపీ దాదాపు కుదేలైపోయింది. పరిస్దితి చేయిదాటిపోయిందని గ్రహించిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే దూరమైన బీసీలను మళ్ళీ దగ్గరకు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే తొందరలోనే కేవలం బీసీల కోసమే జిల్లాల పర్యటనలు చేయాలని అనుకున్నారు.

అయితే అంతకన్నా ముందే పార్టీపరంగా జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రస్ధాయి బీసీ ఫెడరేషన్లు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. రాష్ట్రస్ధాయి బీసీ ఫెడరేషన్ బాధ్యతలు మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు అప్పగించబోతున్నారు. లోక్ సభ నియోజకవర్గాల స్ధాయిలో కూడా గట్టి బీసీ నేతలను గుర్తించే కార్యక్రమం మొదలైంది. ఇపుడు ఏర్పాటు చేయబోయే బీసీ ఫెడరేషన్లు పార్టీకి అనుబంధంగానే పనిచేస్తాయి. ప్రస్తుతం పార్టీకి అనుబంధంగా బీసీ సెల్ ఉంది. అయితే అది అనుకున్నంత గట్టిగా పనిచేయట్లేదు. అందుకనే ఫ్రెష్ గా ఉంటందని బీసీ ఫెడరేషన్ అనేదాన్ని అదనంగా ఏర్పాటు చేస్తున్నారు.

అంటే బీసీ సెల్+బీసీ ఫెడరేషన్ రెండు పనిచేస్తాయన్నమాట. చంద్రబాబు ఆలోచన ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలీదు కానీ రెండింటి మధ్య ఆధిపత్య గొడవలు మొదలవ్వటం మాత్రం ఖాయం. ఎందుకంటే రెండింటిలోను ఉండే బీసీ నేతలు చంద్రబాబుకు తామే దగ్గర నేతలమని చెప్పుకునేందుకు, తమ మాటే చెల్లుబాటవుతుందని నిరూపించుకునేందుకే సమయమంతా సరిపోతుంది. ఇక వీళ్ళు క్షేత్రస్ధాయిలో తిరిగేదెప్పుడు, పార్టీని బలోపేతం చేసేదెప్పుడు. మరి చంద్రబాబు తాజా వ్యూహం ఎలా వర్కవుటవుతుందో చూడాల్సిందే.