సుప‌రిపాల‌న‌లో తెలంగాణ‌, ఏపీ స్థానాలు ఇవే!

సుప‌రిపాల‌న(అంటే.. ప్ర‌జ‌ల‌కు అందుతున్న మంచిపాల‌న‌) సూచీలో రెండు తెలుగు రాష్ట్రాలు తొలి ప‌ది స్థానాల్లో నిలిచాయి. పాల‌నా బాగా అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 9వ స్థానంలో ఉండ‌గా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ 10వ స్థానంలో నిలిచింది. సామాజిక సంక్షేమం, ప్ర‌జారోగ్యం, అభివృద్ధి, మౌలిక వ‌స‌తులు, పారిశ్రామిక రంగం వంటి 10 కీల‌క రంగాల్లో ఈ రెండు రాష్ట్రాలు పురోగ‌తి సాధించిన‌ట్టు ఈ సూచీ పేర్కొంది. ఈ మేర‌కు 2020-21 సంవత్సరానికి సంబంధించి గుడ్ గవర్నెన్స్ సూచీని కేంద్రం విడుదల చేసింది. మొత్తం పది రంగాల్లో గుడ్ గవర్నెన్స్ అవార్డులను కేంద్రం ప్రకటించింది.

ఈ సూచీలో గుజరాత్‌, మహారాష్ట్ర, గోవాలు తొలి మూడు స్థానాలు ద‌క్కించుకున్నాయి.  తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ 9వ స్థానంలోను, ఆంధ్రప్రదేశ్ 10వ‌ స్థానంలోనూ నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రథమ స్థానం దక్కింది. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వాలకు కేంద్రం ఏటా ఈ ర్యాంకులను ప్రకటిస్తూ వస్తోంది. ప్రభుత్వ పాలనలోని 10 రంగాల్లో 58 సూచికల ఆధారంగా ర్యాంకింగ్‌ను నిర్ణయించారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను 4 విభాగాలుగా విభజించారు.

గ్రూప్‌-ఎలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గోవా, గుజరాత్‌, హరియాణా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు ఉన్నాయి. గ్రూప్‌-ఎలో గుజరాత్‌.. గ్రూప్‌-బిలో మధ్యప్రదేశ్‌, ఈశాన్య, పర్వత రాష్ట్రాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ ప్రథమ స్థానాల్లో నిలిచాయి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 సూచికల ఆధారంగా ర్యాంకింగ్‌ ఇచ్చారు. ఈ విభాగంలో 0.634 స్కోరుతో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలవగా, 0.413 స్కోరుతో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల వార్షిక వృద్ధి రేటు జీజీఐ 2019లో 6.3% ఉండగా 2021లో అది 11.3%కి పెరిగింది.

ఉద్యాన విభాగంలో ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 4.7% నుంచి 12.3%కి పెరిగింది. పాల ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 1.4% నుంచి 11.7%కి చేరుకోగా.. మాంసం ఉత్పత్తికి సంబంధించి 2019 జీజీఐలో -6.7% ఉండగా ప్రస్తుతం 10.3%కి పెరిగింది. జీఎస్టీ కింద నమోదైన అంకుర పరిశ్రమలు, సంస్థల సంఖ్య, సులభతర వాణిజ్యం, వ్యాపార, పారిశ్రామికాభివృద్ధి, ఇతర పాలన అంశాల ఆధారంగా ర్యాంకింగ్‌ ఇచ్చారు. 2019లో తెలంగాణలో పారిశ్రామిక వార్షిక వృద్ధి రేటు 0.13% ఉండగా 2020-21లో అది 8.78%కి చేరుకుంది.

గ్రూప్‌-ఎలో ఈ రంగంలో మొత్తంగా 0.699 స్కోరుతో తెలంగాణ తొలి స్థానం దక్కించుకోగా.. 0.662 స్కోరుతో గుజరాత్‌ ద్వితీయ, 0.627 స్కోరుతో ఆంధ్రప్రదేశ్‌ ఆరోస్థానంలో నిలిచాయి. సాంఘిక సంక్షేమం, అభివృద్ధిలో 0.617 స్కోరుతో తెలంగాణ ప్రథమ, 0.546 స్కోరుతో ఆంధ్రప్రదేశ్‌ ద్వితీయ స్థానం పొందింది. మ‌రి ఈ ర్యాంకుల‌పైనా.. స్కోరుపైనా.. ప్ర‌తిప‌క్షాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.