ఫ్యాన్స్‌కి ఫోన్ చేశాకే RRR: రాజమౌళి

మెగా, నంద‌మూరి హీరోల అభిమానుల మ‌ధ్య మామూలుగా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేట్లే ఉంటుంది ప‌రిస్థితి. ఈ రెండు కుటుంబాల హీరోల మ‌ధ్య అంత వైరం ఏమీ క‌నిపించ‌దు కానీ.. వారి అభిమానులు మాత్రం ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో కొట్టేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఆన్ లైన్ యుద్ధాలు మ‌రో స్థాయికి వెళ్లిపోయాయి.

ఈ నేప‌థ్యంలోనే జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌లు క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం బ‌య‌టికి వ‌చ్చిన‌పుడు అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ క‌ల‌యిక‌ను వారి వారి అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న సందేహాలు క‌లిగాయి. కొంత‌మంది దీన్ని స్వాగ‌తించిన‌ప్ప‌టికీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అనుకోవ‌డం.. అవ‌త‌లి హీరోను త‌క్కువ చేసి చూప‌డం ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది.

ఐతే తార‌క్, చ‌ర‌ణ్‌ల‌తో క‌లిసి సినిమా చేయాల‌నుకున్న‌పుడు రాజ‌మౌళికి కూడా అభిమానుల విష‌యంలో సందేహాలు క‌లిగాయట‌. ఇద్ద‌రు హీరోల అభిమానుల‌తో మాట్లాడి ఒక క్లారిటీ తెచ్చుకున్నాకే రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను అనౌన్స్ చేశాడ‌ట‌. త‌న‌కైతే అభిమానుల్లో ఈ కాంబినేష‌న్ విష‌యంలో అభ్యంత‌రాలున్న‌ట్లు క‌నిపించ‌లేద‌ని జ‌క్క‌న్న చెప్ప‌డం విశేషం.

ఆర్ఆర్ఆర్ చేయాల‌నుకున్న‌పుడు ముందు ఇద్ద‌రు హీరోల‌ అభిమానుల‌తోమాట్లాడా.  చరణ్‌ ఫ్యాన్స్‌కు ఫోన్ చేస్తే మా హీరోనే బెస్ట్‌ అన్నారు. మరి ఎన్టీఆర్‌ సంగతి ఏంటని అడిగితే.. తారక్‌ మంచి నటుడే కానీ చరణే బెస్ట్‌ అన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ అభిమానులను కలిసి మాట్లాడాను. వాళ్లు రామ్‌ చరణ్‌ మంచి నటుడు అంటూ, ఎన్టీఆర్‌ బెస్ట్‌ అన్నారు. ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని అర్థమైంది.

ఆ తర్వాతే సినిమా గురించి బయటకు చెప్పాను. తారక్‌, చరణ్‌ నిజజీవితంలో ఎలా ఉంటారో వాళ్లను, వాళ్ల అభిమానులు కూడా అలానే ఫాలో అవుతున్నారు. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవనే విషయం నాక‌ర్థ‌మైంది. తార‌క్, చ‌ర‌ణ్ బేసిగ్గా మంచి ఫ్రెండ్స్ అవ‌డం క‌లిసొచ్చింది, వారి స్నేహాన్నే వెండితెర‌పై చూపించ‌బోతున్నా’’ అని రాజమౌళి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు.