పోలీసుల అష్ట‌దిగ్భందంలో TRS భ‌వ‌న్‌

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ కేంద్ర కార్యాల‌యం వ‌ద్ద వేల మంది పోలీసుల‌తో అత్యంత ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త క‌ల్పించారు. హైద‌రాబాద్ న‌డిబొడ్డున బంజారాహిల్స్‌లోని తెలంగాణభవన్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దారిలో వెళ్లే వాహ‌నాల‌నుకూడా ప‌క్క దారి గుండా.. మ‌ళ్లిస్తున్నారు. అంతేకాదు.. పార్టీ నేత‌ల‌ను కూడా టీఆర్ ఎస్ భ‌వ‌న్ ఇంచార్జ్ అనుమ‌తి లేకుండా అటు వైపు రానివ్వ‌డం లేదు. ఇది ఆక‌స్మికంగా తీసుకున్న‌నిర్ణ‌య‌మ‌ని అధికారులు తెలిపారు. దీనికి కార‌ణం ఏంటి?  ఎప్పుడూ.. సంద‌డిగా ఉంటే.. టీఆర్ ఎస్ భ‌వ‌న్‌ను ఎందుకు ఇంత క‌ట్టుదిట్టం చేశారు? అనేప్ర‌శ్న‌లు స‌ర్వత్రా వినిపిస్తున్నాయి.

విష‌యంలోకి వెళ్తే.. బీజేపీ నాయ‌కుడు.. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మీద దాడి జరిగింది. ఆయ‌న‌ను టీఆర్ ఎస్ ఐటీ విభాగం సిబ్బంది.. చెంప దెబ్బ‌లు కొట్టారు. దీంతో ముందస్తుగా పోలీసులు బందోబస్తును పెంచారు. తీన్మార్‌ మల్లన్న… స‌హా బీజేపీ నేత‌లు కొంద‌రు..  తెలంగాణ భవన్‌ను ముట్టడించేందుకు వస్తున్నారన్న సమాచారంలో అప్రమత్తమైన పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కూడా టీఆర్  ఎస్ నేత‌ల ఇళ్లు, భ‌వ‌నాన్ని ముట్ట‌డించాల‌ని.. పిలుపునిచ్చారు. దీంతో ఒక్క‌సారిగా.. టీఆర్ ఎస్‌, బీజేపీ పార్టీల మ‌ధ్య అగ్గిరాజుకున్న‌ట్టు అయింది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

తీన్మార్‌ మల్లన్న యూట్యూబ్‌ చానల్‌లో నిర్వహించిన ఓ పోల్‌లో తన కుమారుడిపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడంపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా కుటుంబ సభ్యులనుద్దేశించి తామూ స్పందిస్తే ఊరుకుంటారా అంటూ ధ్వజమెత్తారు. కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి నీచంగా వ్యాఖ్యలు చేయడం సంస్కారమా అని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు ఇదే నేర్పిస్తున్నారా? అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ప్రశ్నించారు. ఇక‌, కేటీఆర్ అనంత‌రం.. మంత్రులు.. నిరంజ‌న్‌రెడ్డి, అజ‌య్ స‌హా.. నేత‌.. బాల్కా సుమ‌న్ వంటివారు మ‌రింతగా తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై ఫైర‌య్యారు.

ఇక‌, ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన బీజేపీ నాయ‌కులు కూడా అంతే రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు. టీఆర్ ఎస్‌పై విరుచుకుప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ ట్వీట్ తర్వాత తన ఆఫీస్పై, తనపై దాడి జరిగిందంటూ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. కేటీఆర్ మనుషులు ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు. ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న తెలంగాణ భవన్ను ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు బందోబస్తు పెంచారు. ప్ర‌స్తుతం ఈ ఆఫీస్‌కు దారితీసే అన్ని దారుల‌ను నిలిపివేశారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.