మోడీ జీతం నుంచి రూ.1000 విరాళం

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. స్వ‌యంగా త‌న జీతం నుంచి 1000 రూపాయ‌ల‌ను విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ర‌శీదును కూడా ఆయ‌న తీసుకున్నారు. మ‌రి అంత పెద్దాయ‌న విరాళం ఎవ‌రికి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? అనే సందేహం కామ‌న్ క‌దా.. ఇది.. చ‌ద‌వండి..

భారతీయ జనతా పార్టీ “మైక్రో డొనేషన్స్‌“ వ‌సూలు చేస్తోంది. అంటే.. సూక్ష్మ స్తాయి విరాళాలు అన్న‌మాట‌. దీనిలో 5 రూపాయ‌ల నుంచి ఎంతైనా స్వీక‌రిస్తారు. దీనికి సంబంధించి ర‌శీదు కూడా ఇస్తారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాన మంత్రి తొలిగా.. త‌న విరాళంగా రూ. 1000 ఇచ్చారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. అంద‌రూ కూడా సహాయం చేయాలని బీజేపీ మద్దతుదారులను కోరినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో అభ్య‌ర్థించారు. ఈ మేరకు మోడీ చేసిన‌ ట్విట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ అవుతోంది.

” నేను భారతీయ జనతా పార్టీ  ఫండ్‌కి రూ. 1,000 విరాళం ఇచ్చాను. ఎల్లప్పుడూ దేశానికి మొదటి స్థానం ఇవ్వాలనేది నా కోరిక. మా క్యాడర్ ద్వారా జీవితాంతం నిస్వార్థ సేవ చేసే సంస్కృతి మీ సూక్ష్మ విరాళం ద్వారా మరింత బలోపేతం అవుతుంది. బీజేపీని బలోపేతం చేయడంలో సహాయపడండి. అలాగే భారతదేశాన్ని బలంగా తయారు చేయడంలో సహాకరించండి ‘ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అంతేకాదు బీజేపీ నిధికి మోదీ విరాళంగా ఇచ్చిన రసీదు కూడా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

మ‌రోవైపు  బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ నడ్డా కూడా పార్టీ ఫండ్‌కు రూ.1,000 విరాళంగా ఇచ్చారు.  ఈ మేరకు నడ్డా ట్విట్టర్‌లో… నేను నమో యాప్ అనే  ‘డొనేషన్’ మాడ్యూల్‌ని ఉపయోగించి బీజెపీని బలోపేతం చేయడంలో నా వంతు సహకారం అందించాను. అంతేకాదు రిఫరల్ కోడ్‌ని ఉపయోగించి ఈ ప్రజా ఉద్యమంలో స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా కనెక్ట్ చేయవచ్చు” అని ట్విట్‌ చేశారు. అయితే ఈ విరాళాలు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా బీజేపీ ఈ భారీ డ్రైవ్‌ని ప్రారంభించింది. పైగా సూక్ష్మ విరాళాలు రూ. 5 నుండి రూ. 1,000 వరకు ఉండవచ్చు అని నడ్డా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

పార్టీ వాలెంటరీ కలెక్షన్స్ కోసం మైక్రో డొనేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా పార్టీలోని ప్రతి వ్యక్తి నుంచి కనిష్టంగా 5 రూపాయలతో మొదలుకుని గరిష్టంగా 1,000 రూపాయల వరకు విరాళాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన దీన్ దయాల్ ఉపాధ్యాయ్ వర్ధంతి అయిన ఫిబ్రవరి 11 వరకు కొనసాగించనున్నట్లు ప్రకటించారు. మరి ఇది ఇప్ప‌టికైతే.. స్వ‌చ్ఛంద‌మే..మున్ముందు.. కార్య‌క‌ర్త‌లు డిమాండ్ చేస్తారేమో చూడాలి.