‘శ్యామ్ సింగ రాయ్’ని ఎందుకు వదిలేశారు?

టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘శ్యామ్ సింగ రాయ్’ను ప్రకటించిన నిర్మాణ సంస్థ ఒకటి. ఆ తర్వాత దాన్ని నిర్మించిన సంస్థ మరొకటి. మొదటగా టాలీవుడ్ హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చింది. ముందు నానికి రాహుల్ సంకృత్యన్ కథ చెప్పి ఒప్పించడం.. తర్వాత నాని ‘జెర్సీ’ సినిమా చేసిన సితారలోనే ఈ సినిమా చేయడానికి ప్రపోజల్ పెట్టడం.. వాళ్లు కూడా ఓకే అనడం.. చకచకా జరిగిపోయాయి. ఘనంగా సితార వాళ్లే అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఏం జరిగిందో ఏమో.. వాళ్లు ఉన్నట్లుండి ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేయాలని నిర్ణయించుకున్నారు.

ఇక ఈ సినిమా ఆగిపోతుందేమో అనుకుంటే కొత్త నిర్మాణ సంస్థ అయిన నిహారిక ఎంటర్టైన్మెంట్స్ రంగప్రవేశం చేసింది. ఈ బేనర్ మీద వెంకట్ బోయనపల్లి ‘శ్యామ్ సింగ రాయ్’ను రాజీ లేకుండా నిర్మించాడు. మధ్యలో కొన్ని అడ్డంకులు ఎదురైనా తట్టుకుని సినిమాను పూర్తి చేశారు. రిలీజ్ కూడా చేశారు. ప్రేక్షకుల స్పందన కూడా ఆశాజనకంగానే ఉంది.

ఐతే సితార వాళ్లు ‘శ్యామ్ సింగ రాయ్’ను వదిలేయడానికి కారణమేంటన్నది బయటికే రాలేదు. దర్శకుడు రాహుల్ సంకృత్యన్‌కు సైతం వాళ్లు అసలు విషయం చెప్పలేదట. కానీ వాళ్లీ చిత్రాన్ని వదిలేయడానికి కారణమేంటో తాను అర్థం చేసుకున్నట్లుగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాహుల్ వెల్లడించాడు. ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ కావడం, కమర్షియల్‌గా ఇది వర్కవుట్ అవుతుందో కాదో అన్న టెన్షన్‌తోనే ప్రాజెక్టును పక్కన పెట్టి ఉంటారని తాను భావిస్తున్నట్లు అతను చెప్పాడు.

ఐతే సితార వాళ్లు పక్కకు వెళ్లినా వెంకట్ బోయనపల్లి తాము ఏం అడిగితే అది ఇచ్చి రాజీ లేకుండా సినిమాను ప్రొడ్యూస్ చేసినట్లు రాహుల్ వెల్లడించాడు. ఈ సినిమా మొదలైనపుడు అనుకున్న దాని కంటే బడ్జెట్ పెరిగిన మాట వాస్తవమే అని అతను అంగీకరించాడు. కానీ కరోనా, వర్షాల వల్ల బడ్జెట్ పెరిగిందే తప్ప తన వరకు ఒక్క షెడ్యూల్ కూడా తప్పకుండా అనుకున్నది అనుకున్న ప్రకారం సినిమా తీశానని అతను చెప్పాడు. ఐతే నిర్మాత మాత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ను డెఫిషిట్‌తోనే రిలీజ్ చేశాడు. ఏపీలో టికెట్ల రేట్ల సమస్య, థియేటర్ల మూత కారణంగా ఈ చిత్రానికి అక్కడ ఆదాయంలో బాగానే గండి పడేలా ఉంది. మరి ఓటీటీ, ఇతర డీల్స్‌తో నిర్మాత ఏమేర సేఫ్ అవుతాడో చూడాలి.